కెజిబి చెల్లింపులపై న్యాయవిచారణకు అద్వానీ డిమాండ్
న్యూఢిల్లీ: రష్యా గూఢచార సంస్థ కెజిబి భారతదేశానికి చెందిన కొందరు కేంద్ర మంత్రులకు, రాజకీయ పార్టీల నేతకలు డబ్బులు చెల్లించిందనే రష్యా మాజీ దౌత్యవేత్త మిత్రోఖిన్ చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచేత విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు ఎల్.కె. అద్వానీ డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతిస్పందించాలని ఆయన ఆదివారం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను డిమాండ్ చేశారు. దేశంలోకి వస్తున్న విదేశీ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా ఆయన కోరారు.
చెన్నై జాతీయ కార్యవర్గ సమావేశంలో తర్వాత మొదటిసారి అద్వానీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, బిజెపి నేతలు అద్వానీ, జస్వంత్ సింగ్ సంయుక్తంగా ప్రధానికి రాసిన లేఖలను మీడియా సమావేశానికి ముందు పంచిపెట్టారు. స్వతంత్ర భారతదేశంలో జరిగిన కుంభకోణాల్లో కెజిబికి సంబంధించిన కుంభకోణం అతి పెద్దదని ఆయన అన్నారు. మిత్రోఖిన్ చేసిన ఆరోపణలు అవాస్తవాలను న్యాయవిచారణలో తేలితే పుస్తక రచయిత, ప్రచురణకర్తలపై పరువునష్టం దావా దాఖలు చేయాలని కూడా ఆయన సూచించారు. కెజిబి చెల్లింపుల వ్యవహారాన్ని పార్లమెంటులో పెద్ద యెత్తున ప్రస్తావిస్తామని ఆయన చెప్పారు. పార్టీ వ్యవహారాల గురించి, ఆర్యస్యస్తో పార్టీ సంబంధాల గురించి, జమ్మూకాశ్మీర్ వంటి సమస్యల గురించి వేసిన ప్రశ్నలకు ఆయన జవాబులు ఇవ్వడానికి నిరాకరించారు. మిత్రోఖిన్ రాసిన పుస్తకం గురించి మాత్రమే జవాబులు ఇస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications