గుంటూరులో ఎవరికీ మద్దతు ఇవ్వం: బాబు
హైదరాబాద్: గుంటూరు మేయర్ ఎన్నికల్లో తమ పార్టీ కార్పోరేటర్లు ఏ వర్గానికి కూడా మద్దతు ఇవ్వబోరని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. కాంగ్రెస్లోని ఇరు వర్గాల మధ్య నెలకొన్న వివాదం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెస్ వివాదాలు ఇతర రాజకీయ పార్టీలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన అన్నారు.
పరోక్ష ఎన్నికల వల్లనే సమస్య ఉత్పన్నమైందని ఆయన అన్నారు. ఎవరికి పడితే వారికి మద్దతు ఇవ్వడం సరైంది కాదని, తమకు అధికారం ముఖ్యం కాదని, సిద్ధాంతం ముఖ్యమని, అందువల్ల తాము గుంటూరు మేయర్ ఎన్నికల్లో ఏ వర్గానికి కూడా మద్దతు ఇవ్వబోమని ఆయన వివరించారు. కాంగ్రెస్ ఇతర పార్టీలవారిని ప్రలోభాలకు గురి చేస్తోందని ఆయన తప్పు పట్టారు. ఏ వర్గానికి కూడా మద్దతు ఇవ్వకూడదని తమ కార్పోరేటర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు ఆయన తెలిపారు.