గ్యాస్ గ్రిడ్ వల్ల పారిశ్రామికాభివృద్ధి: వైయస్
హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పాటు చేయతలపెట్టిన గ్యాస్ గ్రిడ్ వల్ల పారిశ్రామికాభివృద్ధి వేగవంతమవుతుందని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఇంజనీర్స్ సిండికేట్ ఏర్పాటు చేసిన ఒక సదస్సును ఆయన ఆదివారంనాడు ప్రారంభించారు. రాష్ట్రంలో గ్యాస్ గ్రిడ్ను ఏర్పాటు చేసి అన్ని పట్టణాలను కలుపుతామని ఆయన చెప్పారు. దీని ద్వారా గృహ వినియోగానికే కాకుండా పారిశ్రామిక వినియోగానికి కూడా గ్యాస్ అందిస్తామని, దీనివల్ల పరిశ్రమలు పెరుగుతాయని ఆయన అన్నారు. పారిశ్రామికాభివృద్ధి వల్ల నిరుద్యోగం కూడా కొంత తగ్గుతుందని ఆయన అన్నారు.
గత ప్రభుత్వం గ్రానైట్, బాక్సైట్ నిక్షేపాల వెలికితీతలో నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ నిక్షేపాల వెలికితీతకు ప్రభుత్వమే పూనుకుంటుందని ఆయన చెప్పారు. గ్రానైట్, బొగ్గు నిక్షేపాల వెలికితీత కార్యక్రమంలో ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యం కల్పిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అపారమైన ఖనిజ సంపద ఉందని, భూగర్భ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో విఫలమవుతున్నామని, ఖనిజ నిక్షేపాల వెలికితీత కార్యక్రమం చురుకుగా చేపడితే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కూడా మెరుగుపడుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications