బుష్ పర్యటనకు నిరసనగా లెఫ్ట్ సంతకాల సేకరణ
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ భారత పర్యటనకు నిరసనగా రాష్ట్రంలో వామపక్షాలు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాయి. భారతదేశ వ్యవహారాల్లో అమెరికా జోక్యానికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సిపిఐ, సిపియం నాయకులు సోమవారంనాడు చెప్పారు. బుష్ పర్యటనకు నిరసనగా తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు చెప్పారు. మన దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడానికి బుష్ పర్యటన ఉద్దేశమని ఆయన విమర్శించారు.
అణ్వాయుధాల పర్యవేక్షణకు తనకు అధికారం కావాలని అమెరికా ఒత్తిడి పెంచుతోందని, భారత్లో విదేశీ పెట్టుబడుల అనుమతికి కూడా బుష్ ఒత్తిడి తెస్తున్నారని ఆయన విమర్శించారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తమ ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. బుష్కు భారత ప్రభుత్వం రెడ్ కార్పెట్ స్వాగతం చెబుతుండడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. భారత వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని సహించబోమని వామపక్షాల నాయకులు అన్నారు.