పోలవరాన్ని సమర్థిస్తే గిరిజన ఎమ్మెల్యేల వెలి
హౖదరాబాద్: గోదావరినదిపై ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు మద్దతు తెలిపే గిరిజన శాసనసభ్యులను జాతి నుంచి వెలివేస్తామని గిరిజన సంఘాలు హెచ్చరించాయి. పోలవరం ప్రాజెక్టుపై చర్చించడానికి హైదరాబాద్లో సోమవారం ఏర్పాటయిన గిరిజన సంక్షేమ సలహా మండలి సమావేశం హాల్ వెలుపల పలు గిరిజన సంఘాల కార్యకర్తలు ధర్నా చేశారు. సమావేశంలో గిరిజన సంక్షేమ మంత్రి రెడ్యానాయక్తో పాటు గిరిజన శాసనసభ్యులు పాల్గొన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల పెద్ద యెత్తున గిరిజన గ్రామాలు ముంపునకు గురవుతాయని, అందువల్ల పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని గిరిజన సంఘాల నాయకులు అన్నారు. సమావేశం హాల్లోకి ఆందోళనకారులు ప్రవేశించకుండా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటయింది. 1964లో నిర్మించిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన గిరిజనులకు ఇప్పటి వరకు పునరావాసం కల్పించలేదని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామంటే ఎలా నమ్మకం కుదురుతుందని గిరిజన సంఘాల నాయకులు అన్నారు. తమ కన్నీళ్లతో ప్రాజెక్టులు కడతామంటే చూస్తూ ఊరుకోబోమని, వచ్చే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని వారన్నారు.