ప్రముఖ నటీమణి పద్మిని కన్నుమూత
చెన్నై: ప్రముఖ సినీనటి పద్మిని ఆదివారం రాత్రి పొద్దు పోయిన తర్వాత గుండెపోటుతో కన్నుమూశారు. భరత నాట్యంలో పేరెన్నిక గన్న పద్మిని చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఈమె తమిళంలోని మొదటి తరం ప్రముఖ హీరోయిన్లలో ఒకరు. ఆమె వయస్సు 74 యేళ్లు. ఆమె కుమారుడు ప్రేమ్ రామచంద్రన్ అమెరికాలోని వార్నర్ బ్రదర్స్ సంస్థలో పని చేస్తున్నారు. శాస్త్రీయ నృత్యంలో ఆమె అందె వేసిన చేయి. నాలుగేళ్ల ప్రాయం నుంచే ఆమె నృత్యం నేర్చుకోవడం మొదలు పెట్టారు. డాక్టర్ కె.టి. రామచంద్రన్ను వివాహం చేసుకున్న తర్వాత పద్మిని సినీరంగం నుంచి నిష్క్రమించి అమెరికాకు వెళ్లిపోయారు. న్యూజెర్సీలో ఆమె స్థాపించిన పద్మిని స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఎంతో పేరెన్నిక గన్నది.
ముగ్గురు సోదరీమణుల్లో పద్మిని రెండవవారు. ఆమె అక్కాచెల్లెళ్లు లలిత, రాగిణి ఇదివరకే కన్నుమూశారు. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి ఈ నెల 23వ తేదీన తమిళ సినీ పరిశ్రమ చేసిన సత్కార కార్యక్రమంలో ఆమె చివరిసారిగా ప్రజల ముందుకు వచ్చారు. 1949 నుంచి ఆమె 150కి పైగా తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు, హిందీ సినిమాల్లో నటించారు. ఆమ కేరళలోని తిరువనంతపురంలో గల పూజాప్పురలో 1932 జూన్ 12వ తేదీన జన్మించారు. కల్పన చిత్రం ద్వారా ఆమె హిందీ సినీ పరిశ్రమంలో కాలు పెట్టారు. యన్.యస్. కృష్ణ 1950లో నిర్మించిన తమిళ చిత్రం మనమగల్ చిత్రం ద్వారా ఆమె సినీరంగ ప్రవేశం చేశారు. తమిళ దిగ్గజాలు శివాజీ గణేషన్, యం.జి. రామచంద్రన్లతో కలిసి ఆమె పలు చిత్రాల్లో నటించారు. ఆమె కుమారుడు వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరుగుతాయని పద్మిని కుటుంబ సభ్యులు చెప్పారు.