కేరళలో భారీ బ్లాస్ట్.. 13 మంది మృతి.. 30 మందికి సీరియస్.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
వేసవి కారణంగా వివిధ రాష్ట్రాల్లోని బాణసంచా ఫ్యాక్టరీల్లో వరుసగా పేలుళ్లు సంభవిస్తున్నాయి. ఇటీవల తమిళనాడులోని ఓ బాణసంచా కార్మాగారంలో భారీ పేలుడు సంభవించి 17 మంది మృతి చెందిన ఘటనను మరువక ముందే మరో షాకింగ్ ఘటన జరిగింది. కేరళలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. 13 మంది మృతి చెందారు. మరికొంతమంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. పేలుడు జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 40 మందికిపైగా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
కేరళలోని త్రిసూర్ జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఫ్యాక్టరీలో పనిచేసే దాదాపు 40 మందికి పైగా సిబ్బందిలో 13మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇక ఘటనా స్థలంలో భీకర వాతావరణం నెలకొంది. పేలుడు ధాటికి మృత దేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బాణాసంచా నిల్వ ఉంచిన ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు జరిగిందని.. కొన్ని నిమిషాల పాటు అలా బ్లాస్టింగ్ జరుగుతూనే ఉందని స్థానికులు తెలిపారు. పేలుడు పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాప్తి చెందిందని అన్నారు.

మరోవైపు ఎండల తీవ్రత, అధిక ఉష్ణోగ్రతలు ఈ ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఈ ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తోపాటు అధికారులను ఆదేశించారు. ఇక ఇదే ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు అలాగే క్షతగాత్రులకు రూ. 50 వేల పరిహారాన్ని ప్రకటించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా పోస్టు చేశారు.












Click it and Unblock the Notifications