భారీ భూకంపం: 7.4 తీవ్రతతో విలయతాండవం, 3 దేశాలు షేక్..
సోమవారం ఉదయం లాటిన్ అమెరికా దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. భూమి పొరల్లో చోటుచేసుకున్న తీవ్ర కదలికలతో కొలంబియా దేశం భయంకరంగా వణికిపోయింది. రాజధాని నగరంలో భారీ భవనాలు సైతం ఊగిపోవడంతో జనం ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ భారీ భూకంపం ప్రకంపనలు కేవలం కొలంబియాకే పరిమితం కాకుండా.. పొరుగునే ఉన్న ఈక్వెడార్, పనామా వరకు వ్యాపించడం అకస్మాత్తుగా నెలకొన్న భయానక వాతావరణానికి అద్దం పడుతోంది.
కొలంబియా రాజధాని బొగోటాలో సోమవారం అనూహ్యంగా నేల కంపించింది. చూస్తుండగానే ఇళ్లు, కార్యాలయాల భవనాలు అటూఇటూ ఊగిపోయాయి. ఏ క్షణాన ఏ భవనం కుప్పకూలుతుందోనని భయాందోళనకు గురైన జనం అప్రమత్తమై వెంటనే తమ నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. రోడ్లన్నీ క్షణాల్లో కిక్కిరిసిపోయాయి.

తీవ్రత 7.4 గా అమెరికా అంచనా
ఈ భూకంప తీవ్రతపై వివిధ భూగర్భ శాస్త్ర పరిశోధనా సంస్థలు వేర్వేరు లెక్కలను వెల్లడించాయి. అమెరికా జియోలాజికల్ సర్వే ఈ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై ఏకంగా 7.4గా నమోదు చేయగా.. కొలంబియా స్థానిక జియోలాజికల్ ఏజెన్సీ మాత్రం ఇది 6.6 తీవ్రతతో వచ్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. ఇక జర్మనీకి చెందిన GFZ సంస్థ 6.8గా పేర్కొంది. పశ్చిమ కొలంబియాలోని 'శాన్ జోస్ డెల్ పాల్మర్' ప్రాంతానికి సమీపంలో భూమికి దాదాపు 79 నుంచి 100 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు నిపుణులు గుర్తించారు.
⚡🇨🇴Earthquake in Colombia causes severe damage. pic.twitter.com/Wov6ATFPn1
— WW3 Watch (@ww3_2035) August 10, 2026
సరిహద్దులు దాటిన ప్రకంపనలు
ఈ విపత్తు ప్రభావం ఒక్క కొలంబియాలోనే కాకుండా పొరుగు దేశాల్లోనూ స్పష్టంగా కనిపించింది. పక్కనే ఉన్న ఈక్వెడార్ రాజధాని క్విటో నగరంతో పాటు.. సుదూరంగా ఉన్న పనామా దేశంలోనూ ప్రజలు ఈ ప్రకంపనల ధాటికి ఇళ్లలోంచి బయటకు వచ్చారు. అటు వెనిజులా సరిహద్దు ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీన్ని బట్టి ఈ భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
నష్టంపై ఆరా తీస్తున్న అధికారులు
ఊహించని ఈ విపత్తుతో కొలంబియా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ విభాగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఎక్కడైనా భవనాలు కూలిపోయాయా? ఎవరికైనా గాయాలయ్యాయా? అనే వివరాలను క్షేత్రస్థాయి అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అయితే అదృష్టవశాత్తూ ఇప్పటివరకు ఎటువంటి సునామీ హెచ్చరికలు లేవు. అయితే భారీ ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరిగినట్లు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు. ప్రస్తుతానికి అధికారులు పరిస్థితులను నిశితంగా సమీక్షిస్తున్నారు. మరింత డేటా అందిన తర్వాత భూకంప తీవ్రతపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.




Click it and Unblock the Notifications