లోతట్టు ప్రాంతాలు జలమయం: 4గురు మృతి
విశాఖపట్నం: ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు విశాఖపట్నంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలకు గోడలు కూలి ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం నలుగురు మరణించారు. ముసలయ్యపాలెంలో గోడ కూలి తల్లి, ఇద్దరు బిడ్డలు మృతి చెందారు. అలాగే వేపగుంట బిసీ కాలనీలో గోడ కూలి ఒక మహిళ మృతి చెందింది. విశాఖపట్నంలోని పలు కాలనీల్లోకి నీరు వచ్చి చేరింది. మేఘాద్రిగడ్డ రిజర్వాయరుకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ ఎగువన ఉన్న నర్వా గ్రామం నీటి మునిగింది. ఎగువన ఉన్న రిజర్వాయర్ల నుంచి నీటిని వదిలారు.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. విశాఖపట్నం విమానాశ్రయం పార్కింగు స్థలం నీట మునిగింది. దీంతో ప్రయాణికులను ప్రత్యేక బస్సుల్లో తరలిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలను ఆదుకోవడానికి అన్ని చర్యలూ తీసుకోవాలని కూడా ఆయన సూచించారు. వర్షం కారణంగా ఆదివారంనాటి ముఖ్యమంత్రి పర్యటన వాయిదా పడింది.












Click it and Unblock the Notifications