డీఎస్పీ భీంరెడ్డి ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే షాక్.. తొలిరోజే రూ.200 కోట్లకు పైనే
ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించవలసిన పోలీస్ అధికారులు అవినీతికి పాల్పడుతున్న సంఘటనలు అనేకం సభ్య సమాజాన్ని ఎప్పటికప్పుడు షాక్ కు గురి చేస్తూనే ఉన్నాయి. ఏసీబీ అధికారుల తనిఖీలలో కొందరి బాగోతం బయట పడుతుండగా, ఏసీబీ అధికారులకు దొరక్కుండా అక్రమ ఆర్జనకు పాల్పడుతున్న అధికారులు చాలామంది ఉన్నారు.
డీఎస్పీ భీంరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు.. 200 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు
తాజాగా ఏసీబీ అధికారుల వలలో చిక్కిన డిఎస్పి భీంరెడ్డి ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే షాక్ కు గురయ్యారంటే పరిస్థితి మనం అర్ధం చేసుకోవచ్చు. ఏసీబీ అధికారుల వలలో చిక్కిన భీంరెడ్డి 200 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టాడు అని అధికారులు గుర్తించారు. కిలోల కొద్ది బంగారం, వెండితో పాటు, 40 లక్షల రూపాయలు క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్ లు ఉన్నట్టు గుర్తించారు.

డైరీలో 15 మంది బినామీల పేర్లు
ఇళ్ల ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు, ఇలా ఆయన ఆస్తుల చిట్టా చాలా పెద్దగానే ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేకాదు ఆయన ఇంట్లో దొరికిన డైరీలో 15 మంది బినామీల పేర్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మరో రెండు రోజులపాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో కూడా తనిఖీలు చేపట్టనున్నారు
ఆయన బినామీల ఇళ్ళలోనూ సోదాలు
గురువారం ఉదయం నుంచి భీం రెడ్డి ఇళ్ళు, అతడి బంధువుల ఇళ్లలో తనిఖీలు చేపట్టిన ఏసిబి అధికారులు మరో రెండు రోజులు ఈ తనిఖీలను కొనసాగిస్తారని తెలుస్తోంది. ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల పైన తనిఖీలు చేపట్టిన క్రమంలో డిఎస్పి భీంరెడ్డి ని అరెస్టు చేసిన ఎసిబి అధికారులు ఆయనకు సంబంధించి బినామీల ఇళ్లల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు.
తొలిరోజే భారీగా బయటపడిన ఆస్తులు
నార్సింగి లోని వేసెల్లా మెడోస్ విల్లాలో రెండు ఏసీబీ టీమ్ లు సహా మొత్తం 20 ప్రాంతాలలో సోదాలను నిర్వహించారు. హైదరాబాద్ తోపాటు, రంగారెడ్డి, శంషాబాద్, గచ్చిబౌలి, జహీరాబాద్, వికారాబాద్ లలో ఆయనకు స్థలాలు ఉన్నట్టు సమాచారం. మోమిన్ పేట్ లలో ఆయన స్నేహితుడి పేరు మీద ఒక ఫాంహౌస్, గచ్చిబౌలిలో కూతురు పేరు మీద ఒక అపార్ట్మెంట్, బెంగళూరులో బంధువు పేరు మీద ఎకరం స్థలం ఉన్నట్టు గుర్తించారు. మొదటి రోజు భారీగా ఆస్తులు దొరకడంతో, ఈ సోదాలు మొత్తం పూర్తయ్యేసరికి ఆయన ఆస్తులు ఎన్ని వందల కోట్లు ఉంటాయోనని ఆసక్తి నెలకొంది.













Click it and Unblock the Notifications