అక్రమ మైనింగులో వైయస్, జగన్ లకు వాటాలు: బాబు
వరంగల్: అక్రమ మైనింగ్ లో రోజుకు 5 కోట్ల రూపాయల అక్రమాదాయం వస్తోందని, దీనిలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి, ఆయన కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి వాటా ఉందని, అందుకే అక్రమ మైనింగును ప్రోత్సహిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
బుధవారంనాడు ఆయన వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. క్లాస్ వన్ కాంట్రాక్టర్ల నుంచి వైయస్ రాజశేఖర రెడ్డికి పది శాతం ముడుపులు అందుతున్నాయని ఆయన అన్నారు. కాంట్రాక్టర్ల ఆస్తులు వేల కోట్ల రూపాయలకు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.
కాంగ్రెస్ వారు ప్రజలను దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. అవినీతిని ప్రశ్నిస్తున్నవారిపై ఐటి దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తోందని, సబ్ కాంట్రాక్టర్ల వల్లనే ఇది జరుగుతోందని ఆయన అన్నారు. తనపై ఎన్ని విచారణలు వేసినా అభ్యంతరం లేదని, ఇప్పటికే 22 విచారణ సంఘాలు వేశారని ఆయన అన్నారు. వాకపల్లి గిరిజన మహిళలపై అత్యాచారం ఆరోపణలపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతిని బయటపెడుతున్న మీడియాపై ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని, ఇది అప్రజాస్వామికమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications