క్లైమేట్ చేంజ్ భయంకర రూపం! శాస్త్రవేత్తల సంచలన రీసెర్చ్
పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, వాయు కాలుష్యాన్ని విజయవంతంగా తగ్గించడానికి ఐరోపా (యూరప్) ఖండం గత కొన్ని దశాబ్దాలుగా తీసుకుంటున్న కఠినమైన చర్యలు లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడాయి. అయితే, ఈ మంచి పరిణామం వెనుకే ఒక ఊహించని ఆందోళనకరమైన ముప్పు దాగి ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన ఒక అధ్యయనంలో గుర్తించారు. వాతావరణాన్ని పరిశుభ్రం చేయడం వల్ల అక్కడ భూతాపాన్ని (గ్లోబల్ వార్మింగ్) తాత్కాలికంగా అడ్డుకుంటున్న ఒక సహజ రక్షణ కవచం తొలగిపోయిందని, దీనివల్ల వేసవి కాలంలో వడగాల్పుల తీవ్రత మరియు ఎండల వేడి మరింత పెరిగిపోతోందని ఈ కొత్త పరిశోధన సంచలన విషయాన్ని వెల్లడించింది.
ఏమిటా 'సహజ సన్స్క్రీన్'?
ప్రముఖ అంతర్జాతీయ శాస్త్రీయ పత్రిక 'జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్'లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. వాతావరణంలో ఉండే 'సల్ఫేట్ ఏరోసోల్స్' అనే సూక్ష్మ కణాలు గతంలో ఐరోపా ప్రాంతాన్ని చల్లబరచడంలో ఎంతో కీలకమైన భూమికను పోషించాయి. బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను పరిశ్రమలలో పెద్ద ఎత్తున కాల్చడం వల్ల విడుదలయ్యే ఈ రసాయన కణాలు, సూర్యుడి నుంచి వచ్చే వేడి కిరణాలను తిరిగి అంతరిక్షంలోకి పరావర్తనం చెందించేవి. ఒక రకంగా ఇవి భూమికి సహజ సిద్ధమైన సన్స్క్రీన్ లోషన్లా పనిచేస్తూ వేసవి ఉష్ణోగ్రతలను దాదాపు ఒక డిగ్రీ సెల్సియస్ మేర తక్కువగా ఉండేలా కాపాడేవి.

కాలుష్యం తగ్గింది.. వేడి పెరిగింది!
పర్యావరణ నిబంధనల వల్ల ఐరోపాలోని విద్యుత్ కేంద్రాలు, భారీ కర్మాగారాలు తమ కాలుష్య ఉద్గారాలను గణనీయంగా తగ్గించాయి. దీనితో అక్కడ వాతావరణంలో సల్ఫేట్ ఏరోసోల్స్ పరిమాణం వేగంగా తగ్గిపోయింది. ఫలితంగా సూర్యుడి వేడి కిరణాలు నేరుగా భూమిని తాకడం ప్రారంభించాయి. కేవలం ఎండలు పెరగడమే కాకుండా, ఈ వాయు మార్పుల వల్ల ఐరోపా మీదుగా వీచే గాలి ప్రసరణ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతిన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వాతావరణంలో బలమైన అధిక పీడన వ్యవస్థలు ఏర్పడి, వేడి గాలిని ఒకే చోట ఎక్కువ కాలం బంధిస్తూ వడగాల్పుల తీవ్రతను పెంచుతున్నాయి.
ప్రజా ఆరోగ్యం ఓకే.. కానీ గ్లోబల్ వార్మింగ్ మాటేంటి?
అయితే, ఈ పరిణామాల నేపథ్యంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకున్న చర్యలు తప్పిదమని భావించలేమని పరిశోధక బృందం స్పష్టం చేసింది. ఎందుకంటే ఈ సల్ఫేట్ ఏరోసోల్స్ మానవ శరీరంలోకి ప్రవేశిస్తే తీవ్రమైన శ్వాసకోస ఇబ్బందులు, ఇతర ప్రాణాంతక గుండె జబ్బులను కలిగిస్తాయి. ఐరోపాలో కాలుష్యాన్ని అదుపు చేయడం వల్ల ప్రజా ఆరోగ్యం ఎంతో మెరుగైంది. కానీ దీనితో పాటు మరో పక్క, దశాబ్దాలుగా ఈ కాలుష్య కణాల వెనుక దాగి ఉన్న అసలైన భూతాపం మరియు హరితగృహ వాయువుల (గ్రీన్హౌస్ వాయువులు) ప్రభావం ఇప్పుడు పూర్తి స్థాయిలో బయటపడుతోంది.
ఈ కొత్త అధ్యయనం వాయు కాలుష్య నివారణకు, ప్రపంచ ఉష్ణోగ్రతల నియంత్రణు మధ్య ఉన్న సున్నితమైన బలమైన బంధాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఏరోసోల్స్ కల్పించిన తాత్కాలిక రక్షణ కవచం తొలగిపోవడంతో వాతావరణ మార్పుల అసలు రూపం వెల్లడవుతోంది. అందువల్ల కేవలం వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, కార్బన్ ఉద్గారాలను మరియు గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే హరితగృహ వాయువులను ప్రపంచ దేశాలు మరింత వేగంగా అదుపు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని వాతావరణ నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.














Click it and Unblock the Notifications