ప్రాజెక్టుల కోసం పన్నులు వేయం: వైయస్
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రజలపై పన్నులు వేయబోమని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో ఆయన శుక్రవారం సమీక్ష జరిపారు. నీటి తీరువాను పెంచబోమని కూడా ఆయన చెప్పారు. నీటి పారుదల శాఖను రెండుగా విభజించనున్నట్లు ఆయన తెలిపారు. ఒక విభాగం ప్రాజెక్టుల నిర్మాణాన్ని, మరో విభాగం వాటి నిర్వహణను చూసుకునేలా నీటి పారుదల శాఖను విభజించనున్నట్లు ఆయన చెప్పారు.
రూ. 18 వేల కోట్లతో కాలువలను ఆధునీకరించనున్నట్లు, వచ్చే ఏడాది ఏప్రిల్ నెలల పనులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. మైనర్ ఇర్రిగేషన్ ట్యాంకుల ఆధునీకీకరణకు నిధులు కేటాయించనున్నట్లు ఆయన చెప్పారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింది కాల్వల ఆధునీకీకరణకు మాత్రం ప్రపంచ బ్యాంకు నిధులు తీసుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
