వరంగల్లులో భారీ సభకు టిడిపి నిర్ణయం
హైదరాబాద్: వచ్చే నెల 23వ తేదీన వరంగల్లులో బలహీనవర్గాల, చేతివృత్తులవారి భారీ సభను నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశం వివరాలను పార్లమెంటు సభ్యుడు కె. ఎర్రంనాయుడు మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. బలహీనవర్గాల పట్ల, చేతివృత్తి పనివారల పట్ల ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఈ సభ ద్వారా ప్రజల్లోకి తీసికెళ్తామని ఆయన చెప్పారు. వచ్చే నెల 8,9,10 తేదీల్లో చంద్రబాబునాయుడు నల్లగొండ, ఖమ్మం జిల్లా పర్యటిస్తారని ఆయన చెప్పారు.
వ్యవసాయంపై జాతీయ స్థాయిలో ఒక ఎజెండాను తయారు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయాలని, ప్రతి నాయకుడు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. వచ్చే నెల 18వ తేదీన ఎన్టీఆర్ వర్ధంతిని అన్ని గ్రామాల్లో నిర్వహించాలని కూడా నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.