ప్రతిభా బాటిల్, మన్మోహన్ సింగ్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు

2008 సంవత్సరంలోని తొలి సూర్యోదయం దేశంలోని ప్రతి ఒక్కరికి శాంతి, విజయాలను, సంతోషాన్ని తీసుకురావాలని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తన నూతన సంవత్సర సందేశంలో పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పాటిల్ కోరారు.
అవసరాల్లో ఉన్నవారికి, హక్కులకు దూరంగా బతుకుతున్న వారికి తమవంతు సాయం చేయడం ద్వారా ప్రపంచాన్ని మెరుగైన స్థితికి చేర్చేందుకు కృషి చేయాలని కోరారు.
కొత్త ఆశలు, ఆశయాలుతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వారినుద్ధేశించి ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ మాట్లాడుతూ గొప్ప సవాళ్లను ఎదుర్కోవాలనుకుంటున్న వారందరూ నూతన సంవత్సరంలో విజయవంతం కావాలని కోరుకుంటున్నానన్నారు.
పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం వంటి గొప్ప సవాళ్లతో ఇప్పటికీ మిలియన్ల మంది ప్రజలు పోరాడుతున్నారు. వారందరికీ ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో సాయపడదామని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలబడాలనే ఆశలు, ఆశయాలు నెరవేరినప్పుడు ఈ సమస్యల నుంచి బయటపడతామని తెలిపారు.
దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తన నూతన సంవత్సర సందేశంలో గత ఏడాది స్మృతులను పక్కనబెట్టడానికి, సాధించిన విజయాలు, చేసిన తప్పులు మర్చిపోవడానికి సమయం ఆసన్నమైందన్నారు. నూతన సంవత్సరం రాకతో కొత్త లక్ష్యాలను నిర్ధేశించుకునే అవకాశం వచ్చిందని ప్రధాని చెప్పారు.
వ్యక్తిగత, సమిష్టి లక్ష్యాలను సాధించుకునేందుకు కొత్త ప్రారంభాన్ని ఇవ్వడానికి కూడా సమయం ఇదేనని తెలిపారు. ప్రజాస్వామ్య సాంప్రదాయాలతో ఆనందాన్ని వ్యక్తం చేయడానికి కూడా కొత్త సంవత్సరంతో అవకాశం వచ్చిందని అన్నారు. 2008 సంవత్సరం ప్రపంచంలోని వారందరికీ శాంతి, భద్రత, విజయాలను తీసుకురావని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications