వైయస్ పై ఉప్పునూతల తిరుగుబాటు
హైదరాబాద్: తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు, తెలంగాణ ప్రాంతీయ బోర్డు చైర్మన్ ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి తిరుగుబాటు ప్రకటించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిది ఏకఛత్రాధిపత్యంలా ఉందని, వైయస్ ఏది చెప్తే అది గుడ్డిగా నమ్ముతూ వచ్చామని ఆయన గురువారం ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. ప్రాంతీయ బోర్డు చైర్మన్ గా ఉండడం తనకు అవమానంగా ఉందని, బోర్టుకు నిధులు, విధులూ లేవని, ఇచ్చిన హామీలను వైయస్ విస్మరించారని ఆయన అన్నారు. ప్రాంతీయ బోర్టు నుంచి పది రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తమ అభిప్రాయాన్ని పార్టీ అధిష్ఠానవర్గానికి విన్నవించాల్సింది ముఖ్యమంత్రేనని ఆయన అన్నారు. బియస్పీ అధినేత మాయావతి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తామని చెప్పారని, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చెప్పాలని ఆయన అన్నారు.
తాము ఎందుకు కలిసి ఉండాలని, ఎందుకు భయపడాలని, ఎవరి కోసం భయపడాలని ఆయన అడిగారు. విడిపోయి శాంతియుతంగా సోదరుల్లా ఉందామని ఆయన ఆంధ్రా నాయకులకు సూచించారు. తాము దేని కోసం త్యాగం చేయాలని ఆయన అడిగారు. ఆంధ్ర ప్రాంతంతో తమకు పొసగడం లేదని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రాయలసీమ, ఆంధ్రలపై చూపుతున్న ప్రేమ తెలంగాణపై చూపడం లేదని ఆయన విమర్శించారు. తెలంగాణకు ప్రాముఖ్యం ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. ఎందుకు తాము కలిసి ఉండాలని, తమకు నాయకత్వం వహించే స్థాయి లేదా, అన్యాయం జరుగుతుంటే మాట్లాడకుండా ఎలా ఉండాలని ఆయన అడిగారు. ఎవరూ భయపడరని, ప్రజల అభిప్రాయాన్ని మించి ఏదీ ఉండదని, ప్రజల మనోగతం తమకు స్పష్టంగా తెలుసునని ఆయన అన్నారు. కలిసి లాభమని ఆంధ్రా నాయకులు అంటున్నారని, లాభమో కాదో తాము అనాల్సి ఉంటుందని, తెలంగాణ తరఫున వారు మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ ఆస్తులను అమ్మగా వచ్చిన డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో చెప్పాలని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications