తెలంగాణ బంద్: బిజెపి నేతల అరెస్టు
హైదరాబాద్: తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) శుక్రవారం తెలంగాణ బంద్ నిర్వహించింది. యుపిఎ చైర్ పర్సన్ సోనియా పర్యటన పట్ల నిరసన వ్యక్తం చేస్తూ బిజెపి ఈ బంద్ తలపెట్టింది. బిజెపి నాయకులు, కార్యకర్తలు తెలంగాణలోని బస్సు డిపోల వద్ద బైఠాయించి బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు బండారు దత్తాత్రేయ, ఎన్. ఇంద్రసేనారెడ్డి, జి. కిషన్ రెడ్డి వంటి బిజెపి నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బండారు దత్తాత్రేయ నేతృత్వంలో బిజెపి కార్యకర్తలు సచివాలయ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు దత్తాత్రేయను, కార్యకర్తలను అరెస్టు చేశారు.
బిజెపి జాతీయ కార్యదర్శి నల్లు ఇంద్రసేనారెడ్డి మహిళా కార్యకర్తలతో కలిసి హైదరాబాదులోని దిల్ షుక్ నగర్ డిపో వద్ద బైఠాయించి, బస్సుల రాకపోకలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆయనను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. బిజెపి శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డి తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఆయనను కూడా పోలీసులు అరెస్టు చేశారు. బిజెపి కార్యకర్తలు హైదరాబాదులో రెండు చోట్ల బస్సు అద్దాలు పగులగొట్టారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ఆందోళనకారులు రైల్ రోకో నిర్వహించారు. దీంతో తెలంగాణ ఎక్సుప్రెస్ ఆగిపోయింది.
హైదరాబాదులో చెదురుముదురుగా తిరిగాయి. పలు చోట్ల దుకాణాలు మూసివేశారు. బంద్ కారణంగా శుక్రవారం జరగాల్సిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్ష ఆదివారంనాటికి వాయిదా పడింది. తెలంగాణలో బంద్ సందర్భంగా చెదురుమొదురు సంఘటనలు జరిగాయి. విద్యా సంస్థలను ఎబివిపి మూయించింది. బిజెపి కార్యకర్తలు హైదరాబాదు వీధుల్లో తిరుగుతూ దుకాణాలను, వ్యాపార సంస్థలను మూయించారు.












Click it and Unblock the Notifications