కేతిరెడ్డికి జేసీ స్ట్రాంగ్ కౌంటర్! సీమలో సభ పెడతా..
తాడిపత్రి రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించినా, ఒక్కసారిగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం, పోలీసుల జోక్యంతో రణరంగంగా మారింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన నివాసం వద్ద చేపట్టిన నిరసన, దానికి ప్రతిస్పందనగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తాడిపత్రి రాజకీయాల్లో హైటెన్షన్ ను క్రియేట్ చేసాయి.
శుక్రవారం నాడు తాడిపత్రిలో వైసీపీ నేతలు గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టాలని నిర్ణయించుకోగా, అందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకు వెళ్లే క్రమంలో తనును అడ్డుకున్న పోలీసులతో పెద్దారెడ్డి తీవ్ర వాగ్వాదానికి దిగారు. చివరకు తన ఇంటి ముందు గాంధీ చిత్రపటాన్ని ఉంచి ఆయన ఆందోళన చేపట్టారు. పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించిన ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, నిరసనను విరమించాలని సూచించారు. కానీ పెద్దారెడ్డి నిరాకరించడంతో, పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నిన్నటి పరిణామాలపై టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. గత వైసీపీ పాలనలో తాడిపత్రిలో ప్రతిపక్షాలు అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఉండేదని, అప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడని వారు ఇప్పుడు నిరసనలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డి హయాంలో తాడిపత్రి వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని, ఇప్పుడు వారు చేస్తున్న ధర్నాలు కేవలం రాజకీయ నాటకాలని విమర్శించారు. ఎస్పీ కార్యాలయం ముందు మూడు గంటల పాటు వైసీపీ నేతలు నిరసన చేసినా ప్రభుత్వం అడ్డుకోలేదని, కానీ తమ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేదని ఆరోపించడం వారి ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోందని జేసీ మండిపడ్డారు.
గంజాయి సంస్కృతిపై సంచలన ఆరోపణలు
కేతిరెడ్డి పెద్దారెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేసిన జేసీ, తాడిపత్రిలో గంజాయి సంస్కృతికి వైసీపీయే కారణమని సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని, మంగళవారం కోర్టు ముందు వాటిని సమర్పిస్తానని ఆయన ప్రకటించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తమపై పెట్టిన 180 కేసుల విషయంలో న్యాయపోరాటం చేస్తున్నామని, లీగల్ సెల్కు అన్ని వివరాలు అందజేస్తానని స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చిన జేసీ, అధిష్టానంతో చర్చించి రాయలసీమ వ్యాప్తంగా భారీ కార్యకర్తల సభను నిర్వహిస్తానని సవాల్ విసిరారు. తాడిపత్రి రాజకీయాలు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.














Click it and Unblock the Notifications