భారీ వర్షం - సాయంత్రం బయటకు రాకండి, బిగ్ అలర్ట్..!!
భారీ వర్షాల పై బిగ్ అలర్ట్. తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. అదే విధంగా హైదరాబాద్ లో ఈ సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాయంత్రం 6 గంటల తర్వాత నగరంలో వర్ష తీవ్రత పెరిగి.. రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల పైన వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు చేసింది. తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని అంచనా వేసింది. ఇక హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వచ్చే ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. జూన్ 27వ తేదీ నుంచి జులై 2 వరకు భారీ వర్షసూచన జారీ చేసింది. గంటలకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

కొనసాగుతున్న ద్రోణి.. వర్షాల పై అలర్ట్
ప్రస్తుతం కొనసాగుతున్న ద్రోణితో పాటు నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడంతో.. వీటి ప్రభావంతో వానలు కురుస్తాయని వాతావరణశాఖ సూచించింది. అటు ద్రోణి ప్రభావంతో ఏపీలో కూడా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వానలు కురుస్తుండగా.. శనివారం కూడా పలుచోట్ల వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు కూడా అమరావతి వాతావరణ కేంద్రం జారీ చేసింది. ఉత్తరాంధ్ర, కోనసీమ, నెల్లూరులో పిడుగులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. ఇక జూన్ 28వ తేదీన గోదావరి, కృష్ణా జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అన్ని జిల్లాల్లో వానలు పడుతున్నాయి. రానున్న రోజుల్లో వర్షాలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ చెబుతోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన చేసారు.













Click it and Unblock the Notifications