పెళ్లి పందిట్లో వరుడిపై కత్తులతో దాడి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కమలాపురం మండలం శనిగరంలో పెళ్లి పందిరిలోనే వరుడిపై బుధవారం మేనమామలు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన వరుడిని హుటాహుటిన వరంగల్లులోని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తన కూతురు వివాహం విషయంలో గొడవ కారణంగా మేనమామలే ఈ దాడికి పాల్పడ్డారని సమాచారం.
వరంగల్ జిల్లా మడికొండకు చెందిన రాజేందర్ కు మేనమామ తన కూతురును ఇచ్చి 12 ఏళ్ల క్రితం పెళ్లి చేశారు. రాజేందర్ మానసిక స్థితి సరిగా లేదని వారు రాజేందర్ కుటుంబ సభ్యులతో గొడవ పడి తమ కూతురిని ఇంటికి తీసికెళ్లారు. ఈ విషయంపై ఇరు కుటుంబాల మధ్య వివాదం చెలరేగుతోంది. తమ కూతురు వివాదం పరిష్కారం అయ్యే వరకు మిగతా కుమారుల పెళ్లి చేయవద్దని రాజేందర్ తల్లిదండ్రులను హెచ్చరించారు. అయితే వారి హెచ్చరికను ఖాతరు చేయక పెళ్లికి పూనుకోవడంతో వారు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం.