వైయస్ దే బాధ్యత: హరీష్ రావు
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో రాజీనామాలు చేసిన ప్రజాప్రతినిధులే అభ్యర్థులని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఎఆర్ఎస్) నాయకుడు హరీష్ రావు అన్నారు. తెలంగాణ స్థానికులకు ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాన్ని సవరించడానికి జారీ అయిన 610 జీవో ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని, పైగా కొత్త ఉద్యోగాల్లో కూడా స్థానికేతరులకే అవకాశం కల్పిస్తున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. 610 జీవో అమలుకు ఉద్యమాలు చేపడుతామని ఆయన చెప్పారు.
ఇటీవల రాజీనామా చేసిన తమ పార్టీ శాసనసభ్యులకు అంగరక్షకులను తొలగించడంపై ఆయన ప్రభుత్వం మీద తీవ్రంగా ధ్వజమెత్తారు. నాలుగేళ్ల క్రితం రాజీనామాలు చేసినవారికి కూడా ఇప్పటికీ అంగరక్షకులున్నారని, తాము ఇటీవలే రాజీనామా చేసినప్పటికీ తమకు అంగరక్షకులను తీసేశారని ఆయన అన్నారు. తమకేమైనా జరిగితే ముఖ్యమంత్రిదే బాధ్యత అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. తమ రాజీనామాలను ఆపడానికి శాసనసభ్యులకు ప్లాట్లు కేటాయించే జీవోను రెండు నెలలు ఆపారని, తాము రాజీనామా చేసిన తర్వాత జీవో ఇచ్చారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications