ఉప ఎన్నికల పోరుకు పార్టీలు రెడీ
హైదరాబాద్: ఉప ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సన్నద్ధమయ్యాయి. ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తెలంగాణ నినాదంపైనే తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయనుంది. అయితే అభ్యర్థులపై ప్రజలకున్న వ్యతిరేకత ఈ పార్టీకి కొంత ఇబ్బందిని కలిగించే సూచనలున్నాయి. అయితే అభ్యర్థులు ముఖ్యం కాదని, తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇచ్చేందుకు తమకు ఓటు వేయాలని తెరాస అధినేత కె. చంద్రశేఖరరావు ప్రజలను కోరారు. ఆయన ఇప్పటికే ఉప ఎన్నికలు జరిగే స్థానాల్లో పర్యటించారు. దళిత, గిరిజన వాడలు సందర్శించారు. తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ దృష్ట్యా ఉప ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాజీనామాలు చేసిన అభ్యర్థులే ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని కెసిఆర్ ప్రకటించారు. దీంతో ఈ పార్టీ అభ్యర్థులు పూర్తిగా ఖరారైనట్లే.
ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితే అస్తవ్యస్తంగా ఉంది. చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు లేరు. 2004 నాటికే ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెసుకు పెద్దగా బలం లేదు. ఈ ఎన్నికల్లో ఆ సీట్లను తెరాసకు కేటాయించడంతో ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకత్వం ఎదగలేదు. పోటీ చేయడానికి పలువురు ముందుకు వస్తున్నప్పటికీ గెలుపు గుర్రాలు లభించడం కష్టమే. అభివృద్ధి, రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అంశాలపై కాంగ్రెస్ ఎన్నికల్లోకి దిగుతోంది. ఇది కాంగ్రెసుకే కాకుండా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి ప్రతిష్టాత్మకం. లోకసభ నియోజకవర్గాల్లో మంత్రులను పోటీకి దించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై, అభ్యర్థుల ఖరారుపై చర్చించేందుకు పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ రేపు, ఎల్లుండి సమావేశాలు ఏర్పాటు చేశారు. జిల్లా మంత్రులు, ఇంచార్జీ మంత్రులు ఉప ఎన్నికల్లో సమన్వయంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి గురువారంనాటి మంత్రివర్గ సమావేశంలో ఆదేశించారు.
తెలుగుదేశం పార్టీకి బలమైన అభ్యర్థులే ఉన్నప్పటికీ తెలంగాణ ఆకాంక్ష తీవ్రత, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆ పార్టీని ఇబ్బందుల్లో పెట్టవచ్చు. నిజానికి 2004 ఎన్నికల్లో తాము ఏ మాత్రం గెలవడానికి అవకాశం లేని, తెలుగుదేశం అభ్యర్థులు బలంగా ఉన్న సీట్లనే కాంగ్రెస్ తెరాసకు ఇచ్చింది. తెలంగాణపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామనే నినాదం తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం ఉపకరిస్తుందో చెప్పలేం. చాలా నియోజకవర్గాలకు తెలుగుదేశం ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది. సిపియం, సిపిఐ కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించే అవకాశం ఉంది. చేర్యాల, ముషీరాబాదు సీట్లలో తెలుగుదేశం పార్టీ సిపియం అభ్యర్థులను బలపరచవచ్చు. ముషీరాబాద్ వంటి నియోజకవర్గాల్లో బిజెపి బలంగా ఉంది. బిజెపి కూడా కొన్ని స్థానాలకు పోటీ చేసే అవకాశం ఉంది. లోకసత్తా కూడా మూడు నియోజకవర్గాలకు పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. మొత్తం మీద, ఉప ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరుగుతుంది.












Click it and Unblock the Notifications