టిడిపిని వీడేది లేదు: కడియం
వరంగల్: తాను పార్టీని వీడిపోతున్నట్లు జరుగుతున్నదంతా దుష్ప్రచారమేనని, పార్టీని వదిలేది లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు కడియం శ్రీహరి అన్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీయేనని, ఆ పార్టీని వీడేది లేదని, పార్టీలో ఉండే తెలంగాణ కోసం కృషి చేస్తానని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ సెంటిమెంటు ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. తాను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును, జయశంకర్ ను కలిసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన అన్యాయాలను ఎండగట్టడంలో తెరాస విఫలమైందని ఆయన విమర్శించారు.
తెరాసపై ప్రజలకు విశ్వాసం పోయిందని, స్టేషన్ ఘనపూర్ లో తాను గెలిచి తీరుతానని ఆయన చెప్పారు. తెలంగాణ అంశాన్ని అధ్యయనం చేయడానికి పార్టీ వేసిన కమిటీ నివేదిక సమర్పిస్తుందని, ఆ నివేదిక అందగానే పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకునేలా ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
