Bengaluru: 5 కిలోమీటర్లకు రెండున్నర గంటలు! నరకం చూసిన చిన్నపిల్లలు
దేశ విదేశాల దృష్టిని ఆకర్షించే మల్టీ నేషలన్ కంపెనీలు, ఐటీ దిగ్గజాలకు నిలయమైన బెంగళూరు మహానగరంలో నిత్యం కనిపించే ట్రాఫిక్ కష్టాలు పరాకాష్ఠకు చేరాయి. గురువారం సాయంత్రం బెంగళూరులోని వైట్ఫీల్డ్, వర్తూర్-గుంజూర్ ప్రధాన రహదారి (SH-35) పరిధిలో చోటుచేసుకున్న ఘోర ట్రాఫిక్ జామ్.. మౌలిక వసతుల దయనీయ స్థితికి అద్దం పట్టింది. బడి నుంచి అలసిపోయి ఇళ్లకు తిరుగుపయనమైన విద్యార్థులు కేవలం 5 నుంచి 6 కిలోమీటర్ల దూరం దాటేందుకు ఏకంగా రెండు నుంచి రెండున్నర గంటల పాటు స్కూల్ బస్సుల్లోనే చిక్కుకుపోయి నరకయాతన అనుభవించారు.
తమ పిల్లలు సమయానికి ఇళ్లకు చేరకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు రోడ్లపైకి రావాల్సి వచ్చింది. జ్లూరీ (Zluri) సంస్థ సీఈఓ రితీష్ రెడ్డి తన కుమార్తె ఉన్న స్కూల్ బస్సు జీపీఎస్ లొకేషన్ను ట్రాక్ చేస్తూ వర్తూర్ రోడ్డుకు చేరుకోగా, అక్కడ వందలాది స్కూల్ బస్సులు వరుసగా కిలోమీటర్ల మేర నిలిచిపోయిన దృశ్యం కనిపించింది. "ప్రతిరోజూ వర్తూర్ రోడ్డులో 5 కిలోమీటర్ల ప్రయాణానికి పిల్లలు 2 గంటలకు పైగా గడపాల్సి వస్తోంది. నా కూతురు కూడా ఆ బస్సులోనే ఇరుక్కుపోయింది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ప్రధాన స్కూళ్ల నుంచి బయలుదేరిన బస్సులు 5-6 కిలోమీటర్ల దూరానికి 2 గంటల 15 నిమిషాల నుంచి 2 గంటల 30 నిమిషాల సమయం తీసుకున్నట్లు తల్లిదండ్రులు వెల్లడించారు.

రోడ్లపైనే 7 గంటలు: విద్యాసంస్థల వ్యవస్థాపకుల ఆవేదన!
ఇన్వెంచర్ అకాడమీ వ్యవస్థాపకురాలు నూరైన్ ఫజల్ మాట్లాడుతూ.. గురువారం ఒక్కరోజే విద్యార్థులు, ఉపాధ్యాయులు రాకపోకలకే ఏకంగా 7 గంటల సమయాన్ని రోడ్లపైనే కోల్పోయారని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ఒక్క రోజు సమస్య కాదని, ప్రణాళికా రహిత నగరాభివృద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. స్కూల్ వేళల్లో భారీ వాహనాలను రాకుండా నిషేధించాలని, రాంగ్ రూట్ డ్రైవింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని, రోడ్డుపై ఉన్న గుంతలను తక్షణమే పూడ్చివేసి అత్యవసరంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని ఆమె అధికారులను డిమాండ్ చేశారు.
2.5+ hours to travel about 4km from school to home today for kids around Varthur and Gunjur. This is not a one off situation, happens almost every other day. International schools ,big IT companies & lakhs of people have been living in these conditions. pic.twitter.com/ImdqI08bP5
— Deepak Bopanna (@dpkBopanna) September 17, 2026
గుంతల రోడ్లు.. దుమ్ము ధూళితో ఆరోగ్య సమస్యలు!
వర్తూర్ మెయిన్ రోడ్డు ఏళ్లుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని స్థానిక నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా లేని వీధిదీపాలు, రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు, నిరంతరం లేచే దుమ్ము ధూళి వల్ల చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని వాపోతున్నారు. వర్షం పడితే ఈ గుంతలు నీళ్లతో నిండిపోయి ప్రాణసంకటంగా మారుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. వందలాది ఐటీ కంపెనీలు, పాఠశాలలు ఉన్న ఈ ప్రాంతంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి శాశ్వత ట్రాఫిక్ పరిష్కార మార్గాలు చూపాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.














Click it and Unblock the Notifications
