కరీంనగర్ : కరీంనగర్ లోక్సభ స్థానంలో తెరాస చీఫ్ కేసీఆర్ను ఓడించేందుకు అవలంబించాల్సిన వ్యూహంపై స్థానిక శాసనసభ్యుడు, మాజీ మంత్రి, ఆర్టీసీ ఛైర్మన్ ఎం. సత్యనారాయణరావుతో ముఖ్యమంత్రి వైఎస్ విస్తృతంగా చర్చించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కరీంనగర్ ప్రచార వ్యూహంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. సెంటిమెంట్ను అభివృద్ధి నినాదంతో ఎదుర్కునే విషయంపై ప్రధానంగా చర్చ జరిగిందని తెలిసింది. గత పర్యాయం జీవన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్కు ఆధిక్యం రాగా, ఈ దఫా అన్ని నియోజకవర్గాల్లోనూ తెరాసపై పైచేయి సాధించేలా అభివృద్ధి మంత్రాన్ని పదేపదే పఠించడంతో పాటు కేసీఆర్ నాలుగేళ్లలో నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించాలని నిర్ణయించారు.