సిరిసిల్ల బాధ హృదయవిదారకం: చిరు
కరీంనగర్: సిరిసిల్ల చేనేత కార్మికుల ఒక్కో గాధ హృదయ విదారకంగా ఉందని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని చేనేత కార్మికులను ఆయన శనివారం పరామర్శిచి, అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు. చేనేత కార్మికుల గొంతు తన గొంతు అవుతుందని ఆయన చెప్పారు. చేనేత కార్మికులను ఎవరూ పట్టించుకోవడంలేదని, ప్రజారాజ్యం పార్టీ వారిని సాధకబాధకాల్లో పాలు పంచుకుంటుందని ఆయన చెప్పారు. చేనేత కార్మికుల దీన గాధలు వింటే తన గుండె తరుక్కుపోతుందని ఆయన అన్నారు. ప్రజల సాధక బాధకాలు తెలిసిన నాయకుడినే ఇక్కడ పోటీకి దింపుతామని ఆయన చెప్పారు. బాధలను స్పందించే మనిషి లేకపోవడం వల్లనే సమస్య తీవ్రరూపం దాల్చిందని, లేదంటే సమస్య పరిష్కారం కష్టమేమీ కాదని ఆయన అన్నారు.
సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యల గురించి ఎవరైనా ఆలోచించారా అని ఆయన అడిగారు. పట్టించుకునే నాథుడు లేకనే పరిస్థితి తీవ్రరూపం దాల్చిందని ఆయన విమర్శించారు. చేనేత కార్మికుల దారాలే ఉరి తాళ్లవుతున్నాయని ఆయన అన్నారు. సమస్యలు విని వెళ్లిపోయే తత్వం తమది కాదని, పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తామని, శాస్త్రీయంగా అధ్యయనం చేయించి సమస్యను పరిష్కరిస్తామని ఆయన అన్నారు. కొద్ది రోజులు ఆగితే మన జీవితాలను మనమే తీర్చిదిద్దుకుందామని ఆయన అన్నారు. ఇక ముందు నిరాశానిస్పృలతో బతకాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుని ఇక్కడికి వచ్చానని ఆయన చెప్పారు. ఎవరికీ చెప్పకూడదని అనుకున్నానని ఆయన అన్నారు. ఇంత మంది వస్తారని తాను అనుకోలేదని ఆయన అన్నారు. గంట, రెండు గంటల వ్యవధి సమాచారంతోనే ఇంత మంది వచ్చారని ఆయన అన్నారు. అతి త్వరలో మళ్లీ ఈ ప్రాంతానికి వస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications