మాట మార్చిన మంత్రి మారెప్ప
ప్రస్తుతం రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు. ప్రపంచంలో ఎవ్వరూ అమలు చేయలేని పథకాలను ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని కొనియాడారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం విడిపోతే బలహీనపడతామని ఆందోళన చెందారు. రాయలసీమకు అన్యాయం రాయలసీమ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, స్పీకర్లు ప్రధాన మంత్రులు ఎన్నికైనా అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడినట్లు మంత్రి వాపోయారు. ప్రత్యేక తెలంగాణ కావాలని గత ప్రభుత్వాల హయాంలో ఎవ్వరూ డిమాండ్ చేయలేదని, వైఎస్ గద్దెనెక్కాకే అది ఊపందుకుందని, దీనిలో ఆంతర్యం ఏమిటని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనో భావాలు దెబ్బతినేలా తాను మాట్లాడలేదన్నారు. సిపిఐ నేత నారాయణ ప్రభుత్వాన్ని చెప్పుతో కొట్టాలన్నా, వైఎస్ను ల్యాండ్ బ్రోకరనీ కేసీఆర్ వ్యాఖ్యానించినా పట్టించుకోని వారు నా వ్యాఖ్యలపైనే రాద్దాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మేకలనే బలి ఇస్తారు కానీ పులులను కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రివర్గం నుంచి తనను తొలగించాలని వస్తున్న డిమాండ్లపై ఆయన స్పందిస్తూ నేను ఏమీ తప్పు చేయలేదని,అవినీతికి పాల్పడలేదని సమర్థించుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఆధిష్టానం ఆదేశిస్తే కర్నూలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానన్నారు.