శీనును చంపినట్లు చంపుతారు: సత్యంబాబు
విజయవాడ: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మొద్దు శీనును చంపినట్లే తనను చంపుతారని విద్యార్థిని అయేషా హత్య కేసులో నిందితుడు సత్యంబాబు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాడు. ఈ మేరకు అతను బుధవారం మెజిస్ట్రేట్ ముందు పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. మీడియాతో మాట్లాడేందుకు తనకు అవకాశం కల్పించాలని అతను కోరాడు. అయేషా హత్య కేసుతో తనకు సంబంధం లేదని, తనను పోలీసులు బెదిరించి ఇరికించారని అతను ఆరోపించాడు.
నేరం అంగీకరించకపోతే తన తల్లిని, చెల్లెను చంపేస్తామని బెదిరించారని అతను ఆరోపించాడు. తన నుదుటిపై తుపాకి పెట్టి చంపేస్తామని బెదిరించారని అతను చెప్పాడు. ఈ స్థితిలోనే తాను నిర్దోషినైనా నేరం చేసినట్లు అంగీకరించినట్లు అతను తెలిపాడు. కాగా, అయేషా హత్య కేసు మరో మలుపు తిరుగుతోంది. అయేషాను చంచడానికి వాడినట్లు సత్యంబాబు చెబుతున్న పచ్చడి బండపై రక్తం మరకలు లేవని ఫోరెన్సిక్ నివేదికలో స్పష్టమైనట్లు సమాచారం.