తెలంగాణ ఇప్పుడే తేలదు: వైయస్
అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టే ప్రసక్తే లేదని, ఏం చేసినా అధిష్ఠానమే చేయాలని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయడానికే తాము సమాయత్తమవుతున్నామని స్పష్టంచేశారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని కోరబోతున్నట్లు తెలిపారు. తెలంగాణపై చర్చించడానికి తనను కోర్ కమిటీ ఢిల్లీకి పిలిచినట్లు వచ్చిన వార్త నిజం కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలుస్తారా అని అడిగితే తమతో కలవడానికి తమంత తాము ఎవరైనా వస్తే ఆలోచిస్తామని, తాము ఆహ్వానించబోమని ఆయన సమాధానమిచ్చారు.
తమ ఓటు బ్యాంకు పెరిగిందని, ప్రజారాజ్యం వల్ల ప్రతిపక్షాల ఓట్లలోనే కోత పడుతుందని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తమకే ఎక్కువ సీట్లు వచ్చాయని, ఓట్లు కూడా తెరాస కన్నా తమకే ఎక్కువ వచ్చాయని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో తానే మాట్లాడించానని అనడంలో అర్థం లేదని, తాను మొయిలీతో చెప్పించగలనా అని ఆయన అన్నారు. మంత్రి మారెప్పతో తాను మాట్లాడానని, ఇక నుంచి మంత్రి అటువంటి ప్రకటనలు చేయబోరని ఆయన చెప్పారు.