ఎక్స్ ప్రెస్ రైలుకు తప్పిన ముప్పు
శ్రీకాకుళం: ఎర్నాకులం - పాట్నా సూపర్ ఫాస్ట్ ఎక్సుప్రెస్సుకు గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా లక్కవరం వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ ఎక్సుప్రెస్ రైలు గురువారం తెల్లవారు జామున ఒంటి గంట ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 15 మంది దాకా గాయపడ్డారు. గాయపడినవారిని పలాస, సోంపేట ఆస్పత్రులకు తరలించారు. గాయపడినవారిలో ఎక్కువ మంది బీహార్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందినవారు.
పలాస నుంచి బయలుదేరిన అరగంటకే ఈ ఎక్సుప్రెస్ రైలుకు చెందిన 8 బోగీలు పట్టాలు తప్పాయి. వీటిలో రెండు బోగీలు పూర్తిగా ఒరిగిపోయాయి. డ్రైవర్ సమస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెద్ద ముప్పు తప్పింది. జాయింట్ పట్టాలు విరగడంతో ఈ ప్రమాదం జరిగింది. వంద మీటర్ల మేర ట్రాక్ దెబ్బ తిన్నది. దీంతో ఈ దారిలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పట్టాలకు మరమ్మత్తులు చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు.