వైసీపీ క్యాడర్ ఫుల్ యాక్టివేట్- తాజాగా అనంతపురం, తాడిపత్రిలో.. !!
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోమారు తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన సామూహిక దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ నిరసనకు బయలుదేరిన నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని గృహనిర్బంధంలో ఉంచారు. ఆయన ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.
ఆయనకు మద్దతుగా తాడిపత్రికి బయలుదేరిన వివిధ నియోజకవర్గాల నాయకులను పోలీసులు మార్గమధ్యలోనే నిలిపివేయడంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అక్కడి వాతావరణం వేడెక్కింది. ఈ నెల 23న తెలుగుదేశం పార్టీ శ్రేణులు జరిపిన దాడులకు నిరసనగా తాడిపత్రిలోని గాంధీ విగ్రహం కూడలి వద్ద నేడు భారీ సామూహిక దీక్ష చేపట్టాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి మొదట నిర్ణయించారు. ఈ కార్యక్రమం వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న కారణంతో పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తాడిపత్రి భగత్సింగ్ నగర్లో పెద్దారెడ్డి నివాసం చుట్టూ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఆయనను గృహనిర్బంధంలో ఉంచారు. పోలీసుల ఈ చర్యతో ఆగ్రహం వ్యక్తం చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి, తన అనుచరులతో కలిసి నివాసం ముందే రోడ్డుపై కూర్చుని నిరసనకు దిగారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత పెరిగింది. పరిస్థితి అదుపు తప్పకుండా ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి స్వయంగా రంగంలోకి దిగి భద్రతను పర్యవేక్షించారు. మరోవైపు తాడిపత్రికి బయలుదేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి విశ్వేశ్వరరెడ్డిలను అనంతపురం నగర పరిధిలోనే పోలీసులు నిలువరించారు. కోర్టు రోడ్డు వద్ద భారీగా బారికేడ్లతో రహదారిని మూసివేసి వారిని ముందుకు సాగనివ్వలేదు.
పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబడుతూ ఇద్దరు కీలక నేతలు అక్కడే రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష పార్టీల గొంతును రాజకీయ కోణంలో నొక్కేందుకు ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటోందని నాయకులు ఆరోపణలు గుప్పించారు. ఈ పరిణామాలతో ప్రస్తుతం అనంతపురం, తాడిపత్రిలల్లో పోలీసులు గట్టి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారు.
తాడిపత్రి ప్రాంతంలో గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు సాగుతోంది. ఎన్నికల సమయం నుంచి ఇప్పటివరకు ఇక్కడ తరచూ రాజకీయ గొడవలు జరుగుతుండటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. తాజా దీక్షతో మళ్లీ పాత కక్షలు రాజుకునే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు నివేదించడంతోనే, ఈ సారి పోలీసులు ఎటువంటి ఉద్రిక్తతలకు అవకాశం ఇవ్వకుండా కఠిన చర్యలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications