కసబ్ పాకిస్థానీయే: నవాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: ముంబైలో పేలుళ్లకు పాల్పడి పోలీసులకు పట్టుబడ్డ అజ్మల్ కసబ్ పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు చెందినవాడని పాక్ మాజీ ప్రధాని నవాజ్షరీఫ్ అన్నారు. ముంబై పేలుళ్లలో తన పాత్రను పాక్ సైన్యం అంగీకరించాల్సిందేనని అన్నారు. కసబ్ స్వగ్రామాన్ని భద్రతాదళాలు చుట్టుముట్టాయనీ, ఆయన ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకున్నాయనీ, కసబ్ తల్లిదండ్రులను మీడియాతో మాట్లాడనివ్వడం లేదని నవాజ్ అన్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ముంబై దాడుల్లో పాల్గొన్న తీవ్రవాదుల గురించి అధ్యక్షుడు జర్దారీ రోజుకోమాట మాట్లాడుతున్నారనీ, ఆయన నిలకడగా ఉండాల్సిన అవసరం ఉందని నవాజ్ అన్నారు.
కసబ్ తల్లిదండ్రులను కలవడానికి మీడియాకు, ప్రజలకు అవకాశం కల్పించాలని, అప్పుడే వాస్తవం వెలుగులోకి వస్తుందని ఆయన ఒక టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మనకు ఆత్మశోధన అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పాకిస్థాన్ ను విఫల రాజ్యంగా మార్చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితికి విన్నవించడానికి బదులు భారత్ తమ నిఘా సంస్థల సమాచారాన్ని పాకిస్థాన్ తో పంచుకోవాల్సి ఉండిందని ఆయన అభిప్రాయపడ్డారు.