IAS Sri Lakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మిని కరుణించిన చంద్రబాబు..! రిటైర్మెంట్ వేళ..!
ఏపీలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో సీఎంవోలో ఓ రేంజ్ లో హవా కొనసాగించిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మి(IAS Sri Lakshmi).. ఆ తర్వాత ఆయన అధికారం కోల్పోయాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. వచ్చీ రాగానే ఆమెను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. అలా రెండేళ్లు గడిపేసిన కూటమి ప్రభుత్వం.. ఇవాళ హఠాత్తుగా శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రెండేళ్లుగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని సాధారణ పరిపాలన శాఖలోని పాలనా సంస్కరణల విభాగానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఇవాళ సీఎస్ సాయి ప్రసాద్ జీవో జారీ చేశారు. ఇప్పటివరకూ ఈ విభాగం అదనపు బాధ్యతలు చూస్తున్న మరో సీనియర్ ఐఏఎస్ షంషేర్ సింగ్ రావత్ ను ఈ మేరకు రిలీవ్ చేస్తుున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. అంటే రావత్ స్ధానంలో శ్రీలక్ష్మి స్ఫెషల్ సీఎస్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

1988 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన శ్రీలక్ష్మి గతంలో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఉన్నారు. వైఎస్ మరణం తర్వాత జగన్ తో పాటు శ్రీలక్ష్మి కూడా జైలుకు వెళ్లారు. అప్పట్లో జైల్లో ఉండగానే ఆమె ఆరోగ్యం క్షీణించింది. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమె తిరిగి కోలుకున్నారు. ఆ తర్వాత జగన్ సర్కార్ లో మాత్రం ఆమెకు సీఎంవోలో మంచి పోస్టింగ్ లు దక్కాయి. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆమె పనిచేశారు. అదే సమయంలో తనపై నమోదైన కేసులు కొట్టేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా ఆమెకు ఊరట లభించలేదు. చివరికి చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఆమెకు పోస్టింగ్ కూడా ఇవ్వకుండా వేధించారు. చివరికి జూలై 31న రిటైర్మెంట్ అవుతున్న వేళ ఆమెకు మొక్కుబడిగా పోస్టింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.














Click it and Unblock the Notifications