ప్రజారాజ్యానికి ఉమ్మడి గుర్తు లేనట్టే?
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ప్రజారాజ్యానికి ఉమ్మడి చిహ్నం కేటాయింపునకు కమిషన్ నియమాలు అంగీకరించవంటూ త్వరలో హైకోర్టుకు సమాధానమివ్వాలని సీఈసీ నిర్ణయించినట్లు సమాచారం. రాబోయే ఎన్నికల ఏర్పాట్లపై చర్చించడానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామి ఆధ్వర్యంలో నిన్న(సోమవారం) జరిగిన సమావేశంలో ప్రజారాజ్యం గుర్తుపై చర్చ జరిగినట్లు తెలిస్తోంది.
ప్రజారాజ్యం పార్టీ ఇంతవరకూ స్థానిక ఎన్నికల్లో కూడా పోటీచేయనందున సవరించిన నియమాల మేరకు ఉమ్మడి చిహ్నాన్ని కేటాయించలేమని సీఈసీ గతంలో స్పష్టం చేసింది. దీంతో చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. దానిపై స్పందించిన కోర్టు ఉమ్మడి గుర్తు కేటాయింపు అంశాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘానికి సూచిస్తూ ఈనెల 6న ఉత్తర్వులు జారీచేసింది.
హైకోర్టు సూచన మేరకు ప్రజారాజ్యం మరోసారి ఉమ్మడి చిహ్నం కోసం సీఈసీని ఆశ్రయించింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గోపాలస్వామి, మరో కమిషనర్ ఖురేషిలు ప్రజారాజ్యం తాజా పిటీషన్పై సమీక్ష జరిపారు. తమిళనాడులో విజయకాంత్ స్థాపించిన కొత్త పార్టీకి కూడా ఉమ్మడి చిహ్నాన్ని కేటాయించలేదని, ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందన్న విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకురావాలని నిర్ణయించారు.