కోట్లు ఇస్తేనే పీఆర్పీ టిక్కెట్టు
హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీ టికెట్ల పేరిట రూ.కోట్లు లాగడమే ధ్యేయంగా పెట్టుకున్నారని పార్టీ కో-కన్వీనర్, ఎన్నారై సత్యవాసంశెట్టి ఆరోపించారు. టికెట్ అడిగిన తనకు.. రూ.3 నుంచి రూ.5 కోట్లు ఇస్తేగాని అవకాశం లేదని బాహాటంగా చెప్పడం సిగ్గుచేటన్నారు. అందువల్లే..ప్రజారాజ్యంలో సామాజిక న్యాయం లోపించినందున వల్లే పీఆర్పీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
గురువారం హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరానికి చెందిన తాను ప్రజారాజ్యం ఏర్పాటుకు సంతోషించానని చెప్పారు. అమెరికాలో ఉన్నపుడు న్యూజెర్సీ, డల్లాస్ ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేసి అక్కడి తెలుగువారిలో ప్రజారాజ్యం పట్ల ఆసక్తి పెంచామన్నారు. పార్టీకోసం పని చేసేందుకు రాష్ట్రానికి తిరిగొచ్చిన తాను సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలకు రూ.కోటి దాకా వెచ్చించానని, ఇప్పుడిలా కోట్లు ఇస్తేనే టిక్కెట్లు ఇస్తాననటం ఊహించలేకపోయానని, భరించలేకే బయిటకు వచ్చేసానని వాసంశెట్టి వివరించారు.