పచ్చ చొక్కాలే మేశాయి: వైయస్
తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని అన్నారు. గత ఎన్నికల్లో చెప్పినట్లు అన్ని వాగ్దానాలను నెరవేర్చామని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్తు ఇచ్చామని, రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చామని, కుటుంబానికి 30 కిలోలు ఇచ్చామని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు వచ్చే బియ్యాన్ని పచ్చ చొక్కాల వాళ్లు పందికొక్కుల్లా మేశారని ఆయన ఆరోపించారు. అడిగిన ప్రతివారికి రేషన్కార్డులు ఇచ్చామని, ఇళ్లులేని వారికి ఇళ్లు ఇచ్చామని అన్నారు. తమది రైతుల ప్రభుత్వమని అందుకే రైతుల రుణాలను మాఫీ చేశామని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు తాము మేలు చేశామని అదే ధైర్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ ప్రాంతంనుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జైపాల్రెడ్డిని గెలిపించాలని కోరారు.
అంతకు ముందు ఆయన హైదరాబాద్ సోమాజిగూడలోని రాజీవ్గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. తర్వాత అక్కడినుంచి తన ప్రచార జైత్రయాత్ర ప్రారంభించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నెక్లెస్రోడ్డులో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మంత్రి ముఖేష్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ తదితరులు ఆయన వెన్నంటి ఉన్నారు.