15 రాష్ట్రాల్లో తొలి విడత పోలింగ్
న్యూఢిల్లీ: దేశంలోని 15 రాష్ట్రాల్లో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో గురువారం తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ పోలింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల శాసనసభల ఎన్నికల తొలి విడత పోలింగ్ కూడా ప్రారంభమైంది. దేశంలోని 124 లోకసభ నియోజక వర్గాల్లో గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
పోలింగ్ ప్రారంభం కావడానికి 38 గంటల ముందుగానే ప్రచారాన్ని నిలిపేశారు. అయితే అభ్యర్థులు ఓటర్లకు గాలం వేయడానికి ఇతరేతర పద్ధతులు అవలంబించారు.14.31 కోట్ల ఓటర్ల కోసం తొలి విడత 1.85 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేరళలో 20, ఛత్తీస్ ఘడ్ లో 11, మేఘాలయలో 2 లోకసభ స్థానాలకు తొలి దశలోనే పోలింగ్ ముగుస్తోంది. బీహార్ లో 13, ఉత్తర ప్రదేశ్ లో 16, మహారాష్ట్రలో 13, ఆంధ్రప్రదేశ్ లో 22, జార్ఱండ్ లో 6, ఒరిస్సాలో 10, అస్సాంలో 3, అరుణాచల్ ప్రదేశ్ లో రెండు, మణిపూర్ లో, జమ్మూ కాశ్మీర్ లో 1 స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరుగుతోంది. ఈ రాష్ట్రాల్లో మలి విడత పోలింగ్ జరుగుతుంది. తొలి దశలో 1,715 అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి విడత పోలింగ్ జరుగుతున్న స్థానాల్లో లూలా ప్రసాద్ యాదవ్, మురళీ మనోహర్ జోషీ, కె. చంద్రశేఖరరావు వంటి ప్రముఖులు పోటీలో ఉన్నారు.