టిడిపికి రక్షణ కావాలి
హైదరాబాద్: ఎన్నికలు తర్వాత రాష్ట్రంలో హింస, రాజకీయ హత్యలు పెరిగాయని వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మహాకూటమి ఆరోపించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కోడ్ ముగిసే వరకూ రాష్ట్రంలో అదనపు బలగాలను మోహరించాలని మహాకూటమి నేతలు కోరారు. ఈ విషయాలపై కంప్లైంట్ చేసేందుకు కూటమినేతలు నాగం జనార్దన్రెడ్డి, కంభంపాటి రామ్మోహన్ రావు (టీడీపీ), కె.రామకృష్ణ (సీపీఐ), బి.చంద్రారెడ్డి (సీపీఎం) సోమవారం సీఈవో ఐవీ సుబ్బారావును కలిశారు.
వైఎస్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాక రాష్ట్రంలో రాజకీయ హత్యలు పెరిగిపోయాయని, పరిటాల రవితో సహా 40 మంది తెదేపా నేతల్ని పొట్టన పెట్టుకున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. తాజా ఎన్నికల అనంతరం ఈనెల 2న ధర్మవరంలో టీడీపీ నేత కేశవయ్యను హత్య చేశారని నాగం జనార్దనరెడ్డి పేర్కొన్నారు. ఈ హత్య వెనుక ఆ జిల్లా కాంగ్రెస్ నేతల హస్తం ఉందని ఆరోపించారు. వైఎస్ పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి ఒక్క అనంతపురం జిల్లాలోనే 40 మంది టీడీపీ నేతలు హత్యకు గురయ్యారని వివరించారు. అధికారపార్టీ ప్రమేయంతో జరిగిన ఈ దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.
తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడుల్ని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇటీవల ధర్మవరంలో జరిగిన అమర కేశవయ్య హత్యను కూడా ఫాక్షన్ హత్యగా పేర్కొంటూ అక్కడి డిప్యూటీ ఎస్పీ సుబ్రహ్మణ్యం కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఆయన కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈనెల 28న ఎన్నికల కోడ్ ముగిసే వరకూ తెలుగుదేశం అభ్యర్థులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications