రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు పర్మిషన్.. సర్వం సిద్ధం; పర్యటన వెనుక..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సర్వం సిద్ధమైంది. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ ప్రత్యేక ఏసీబీకోర్టు ఆయనకు దేశ పర్యటనకు కావలసిన అనుమతినిచ్చింది. అధికారిక పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు పాస్ పోర్ట్ ను తిరిగి ఇవ్వాలని, ప్రయాణానికి అనుమతించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ జరిపిన కోర్టు, పలు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేస్తుంది.
ఆగస్ట్ 17 నుండి సెప్టెంబర్ 10వరకు విదేశాలకు సీఎం రేవంత్
ఏసిబి ప్రత్యేక కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగస్ట్ 17 నుండి సెప్టెంబర్ 10వరకు విదేశాలలో పర్యటించనున్నారు. యునైటెడ్ కింగ్ డమ్, అమెరికా, జర్మనీ, చైనా దేశాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వివిధ రంగాలలో పెట్టుబడుల సమీకరణకు, తెలంగాణా అభివృద్ధి, అధికారిక చర్చల కోసం ఈ పర్యటన రూపుదిద్దుకుంది.

రేవంత్ పర్యటనకు ఏసీబీ కోర్టు
ఈ మేరకు ఏసీబీ కోర్టు కొన్ని కీలక షరతులు విధించింది. సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఒకరి హామీని కోర్టుకు సమర్పించాలి. అంతేకాదు సీఎం రేవంత్ విదేశీ పర్యటన ప్రణాళికను కోర్టుకు ముందే అందించాలి. అక్కడ పర్యటించే ప్రదేశాలు, ఆయా దేశాలలో బస చేసే పూర్తి వివరాలను కోర్టులో ముందుగానే ఇవ్వాలని పేర్కొంది.
సెప్టెంబర్ 18, 2026లోగా తిరిగి కోర్టుకు రేవంత్ రెడ్డి పాస్ పోర్ట్
అంతేకాదు కేంద్ర విదేశాంగ శాఖ నుండి అవసరమైన రాజకీయ అనుమతి పొందాల్సి ఉంటుంది. మళ్ళీ పర్యటన ముగిసి తిరిగి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 18, 2026లోగా రేవంత్ రెడ్డి పాస్ పోర్ట్ ను తిరిగి కోర్టులో సమర్పించాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో ఉండగా రేవంత్ రెడ్డిపైన ఓటుకు నోటు కేసు ఉంది. ఈ కేసులో రేవంత్ రెడ్డిని మొదటి నిందితుడిగా పేర్కొన్నారు.
ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డి
అప్పట్లో ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ కు రూ. 50 లక్షలు లంచం ఇవ్వటానికి ప్రయత్నం చేశారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి దాదాపు నెలరోజులు జైలుశిక్ష అనుభవించారు.
ఇంకా రేవంత్ పై కొనసాగుతున్న ఓటుకు నోటు కేసు
ఆపై బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన పాస్ పోర్ట్ ను కోర్టుకు బెయిల్ షరతులలో భాగంగా సమర్పించాల్సి వచ్చింది. ఇంకా ఈ కేసు సుప్రీం కోర్టులో కొనసాగుతుంది. ఈ కేసులో ఇంకా తీర్పు రాకపోవటంతో సీఎం రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లాలంటే ప్రతిసారి ఏసీబీ కోర్టు అనుమతి తప్పనిసరిగా మారింది.












Click it and Unblock the Notifications