వామపక్షాలపై హరీష్ నిప్పులు
హైదరాబాద్: తమ పార్టీ ఎన్డీయెతో కలిసి పనిచేయడాన్ని తప్పు పడుతున్న వామపక్షాలపై, కాంగ్రెసుపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు హరీష్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తాము ఎన్డీయెతో కలిసి పనిచేయడానికి సిద్ధపడినట్లు ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో స్ఫష్టం చేశారు. రాష్ట్రంలో మహా కూటమి ఎన్నికల వరకే పరిమితమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పారని, ఇప్పుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. సిపిఐ, సిపిఎంలకు తమను విమర్శించే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు.
తెలంగాణను మోసం చేసిందెవరో కాంగ్రెసు నాయకుడు వి. హనుమంతరావు చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణను కాంగ్రెసు మోసం చేసిన విషయం గురించి హనుమంతరావు ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ శాసనసభ్యులను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చీల్చినప్పుడు, తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం చేసినప్పుడు, తెలంగాణ నీళ్లను పక్కదారి పట్టిస్తున్నప్పుడు, తెలంగాణవారిని ముఖ్యమంత్రి విదేశీయులన్నప్పుడు మాట్లాడని హనుమంతరావు తాము ఎన్డియేతో కలిస్తే విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు అడ్రస్ గల్లవుతుందనే భయంతోనే హనుమంతరావు తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన మూడో కొడుకు గురించి స్ఫష్టం చేయని లగడపాటి రాజగోపాల్ కు ఇతరుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ ను విమర్శించి పెద్దవాడినై పోదామని లగడపాటి రాజగోపాల్ అనుకుంటున్నారని, ఆ స్థాయి లగడపాటికి లేదని ఆయన అన్నారు. విజయవాడ లోకసభ స్థానంలో రాజగోపాల్ ఓటమి ఖాయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications