వైసీపీలోకి రీ ఎంట్రీ..? తేల్చి చెప్పిన సాయిరెడ్డి..!!
వైసీపీ మాజీ నేత విజయ సాయిరెడ్డి తన పొలిటికల్ రీ ఎంట్రీ పై కీలక అప్డేట్ ఇచ్చారు. వైసీపీకి రాజీనామా చేయటంతో పాటుగా రాజ్యసభ సభ్యత్వానికి సాయిరెడ్డి దూరమయ్యారు. తాను ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని వ్యవసాయం చేసుకుంటానని అప్పట్లో ప్రకటించారు. కాగా, రాజకీయ అంశాల పైన స్పందిస్తూనే ఉన్నారు. ఇక.. ఇప్పుడు సాయిరెడ్డి తిరిగి వైసీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీంతో.. సాయిరెడ్డి ఇచ్చిన సమాచారంతో మరింత ఆసక్తి పెరుగుతోంది.
మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి రాజకీయంగా రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు గతంలోనే ప్రకటించారు. మీడియా సంస్థను ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అయితే, వైసీపీ నుంచి బయటకు వచ్చిన తరువాత సాయిరెడ్డి రాజకీయంగా మాత్రం పలు అంశాల పైన స్పందిస్తూనే ఉన్నారు. టీడీపీ, వైసీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. పవన్ పైన మాత్రం ఎలాంటి విమర్శలు చేయటం లేదు. అప్పుడప్పుడు హిందుత్వ స్వరం వినిపించే విధంగా పోస్టులు కనిపిస్తున్నాయి. మొదట్లో ఆయన బీజేపీలోకి వెళదామనుకున్నారనే టాక్ వినిపించింది. అయితే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీలోకి ఆయన వెళ్లే ఛాన్స్ దక్కలేదు. దీంతో, కొత్త పార్టీ ఏర్పాటు దిశగా సాయిరెడ్డి కసరత్తు ముమ్మరం చేసారనే ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో తిరిగి వైసీపీలోకి వస్తున్నారనే చర్చ ఉంది.

సాయిరెడ్డి రాజకీయ భవిష్యత్ పై ప్రకటన..
ఈ సమయంలో సాయిరెడ్డి ఈ చర్చకు ముగింపు పలుకుతూ సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసారు. ఈ మేరకు సాయిరెడ్డి ట్వీట్ చేసారు. అందులో... "నా రాజకీయ పునః ప్రవేశం, భవిష్యత్ ప్రణాళిక, కార్యాచరణ త్వరలో పాత్రికేయ మిత్రుల సమావేశంలో ప్రకటిస్తాను. నాది స్వతంత్ర భావజాలం. ఎలాంటి ఒత్తిళ్లకూ, ప్రలోభాలకు, ప్రభావాలకూ లోనుకాకుండా నిర్భయంగా రాష్ట్ర ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఆత్మగౌరవంతో నిర్ణయం తీసుకుంటాను.." అంటూ సాయిరెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీని ద్వారా సాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా.. కొత్త పార్టీ అజెండా ఏంటి.. నిజంగా పార్టీ ప్రారంభిస్తే ఎవరిని టార్గెట్ చేస్తారు.. ఎవరికి నష్టం జరుగుతంది అనే అంశాల పైన ఇప్పటికే చర్చ మొదలైంది. దీంతో.. సాయిరెడ్డి చేసే రాజకీయ ప్రకటన పైన ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications