నేను మోసపోయాను: కెసిఆర్
2004 ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిన శవంలా పడి ఉండేదని. 2001లో తెలంగాణ ఆందోళన మొదలైనప్పుడు కాంగ్రెస్ ఆ ఉద్యమ ఉద్ధృతిని గమనిస్తూ వచ్చిందని, తనతో కలిస్తే తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని తెరాసకు హామీ ఇచ్చిందని, తెలంగాణ ఉద్యమ ఆక్సిజన్ పీల్చుకుని ప్రాణం పోసుకుందని, కానీ ఈ ఐదేళ్లలో రాష్ట్రమివ్వలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఈ దేశ ప్రధాని మన్మోహన్సింగ్ తెలంగాణ ప్రజలను మోసగించారని, తాను మోసపోయానని ఆయన అన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ తనకు పెద్దన్నయ్య లాంటివారని, మూడు రోజుల కింద తాను ఢిల్లీకి వచ్చిన వెంటనే బాదల్ నుంచి తనకు పిలుపు అందిదని ఆయన చెప్పారు. మరికొందరు మిత్రులను కూటమిలోకి తీసుకురావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల సంఘర్షణ గురించి అద్వానీకి బాగా తెలుసునని, అద్వానీ చేతుల మీదుగా తెలంగాణ ఏర్పాటు చేసి మా ప్రజల దుఃఖాన్ని దూరం చేయాలని ఆయన అన్నారు.
మహాకూటమి రాష్ట్రానికే పరిమితమని, అది జాతీయ స్థాయిలో ఏర్పడలేదని తెరాస అధినేత కె.చంద్రశేఖరరావు స్పష్టంచేశారు. ఆదివారం లూధియానాలో ఎన్డీఏ బహిరంగ సభ తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మహాకూటమి జాతీయ స్థాయి కూటమని తానెప్పుడూ చెప్పలేదని, కావాలంటే రికార్డులు చూడండని సూచించారు. ఎన్డీఏ పక్షాలు తెలంగాణకు సమష్టిగా మద్దతిస్తున్నాయని, అలాంటప్పుడు చీకటి బిలంలోకి ఎందుకెళ్లాలని ప్రశ్నించారు. చాలా మందితో మాట్లాడిన తర్వాతే ఎన్డీఏలో చేరాలన్న నిర్ణయానికి వచ్చామని కేసీఆర్ బదులిచ్చారు.