హైదరాబాద్ లో మరో స్వైన్ ఫ్లూ కేసు
హైదరాబాద్: హైదరాబాద్ ఛాతీ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థికి స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1) ఉన్నట్లు బుధవారం నిర్ధరణ అయ్యింది. ఈ విద్యార్థి నుంచి సేకరించిన నమూనాలను ఢిల్లీలోని జాతీయ అంటువ్యాధుల పరీక్షా కేంద్రం, పుణెలోని మరో పరీక్షా కేంద్రానికి పంపించారు. అనంతరం అతడికి స్వైన్ఫ్లూ ఉన్నట్టు ఆ రెండు పరీక్ష కేంద్రాలు తెలిపాయని డాక్టర్ శుభాకర్ చెప్పారు.
హైదరాబాద్ కు చెందిన ఓ వైద్య విద్యార్థి (20) నెలరోజుల క్రితం కెనడాలోని టోరెంటోలో బంధువుల ఇంటికి వెళ్లాడు. గతనెల 30న బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానంలో లో నగరానికి చేరుకున్నాడు. మరుసటి రోజు నుంచి దగ్గు, జ్వరం, ముక్కు నుంచి నీరుకారడం తదితర లక్షణాలు కనిపించడంతో తొలుత కేర్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఛాతీ వైద్యశాలకు వెళ్లాడు. గతనెల 13న అరబ్ ఎమిరేట్స్ విమానంలో వచ్చిన 23 ఏళ్ల హైదరాబాద్ యువకుడికి కూడా స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది. కోయంబత్తూరులో తల్లీ, కొడుకులకు స్వైన్ ఫ్లూ సోకినట్లు పరీక్షల్లో వెల్లడైంది. దీంతో దేశంలో స్వైన్ ఫ్లూ సోకినవారి సంఖ్య నాలుగుకి చేరుకుంది.