ఆస్ట్రేలియాలో లంక విద్యార్థులపై దాడి
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో ఇక శ్రీలంక విద్యార్థుల వంతు వచ్చింది. ఇప్పటి వరకు భారతీయ విద్యార్థులపై దాడులు జరుగుతుండగా తాజాగా శ్రీలంక విద్యార్థులు కూడా దాడులకు లక్ష్యంగా మారారు. కాన్ బెర్రాలో ముగ్గురు వ్యక్తులు జాతి వివక్షతో అవమానిస్తూ ఇంటిలోకి ప్రవేశించి శ్రీలంక విద్యార్థులపై దాడి చేశారు. ఈ దాడిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎబిసి న్యూస్ తెలియజేసింది. ఆ వ్యక్తులు కిటికీల గుండా లోనికి ప్రవేశించి దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఉత్తర కాన్ బెర్రాలోని మాక్వెరీలో ఈ సంఘటన జరిగింది. తనను కత్తితో బెదిరించారని శ్రీలంక విద్యార్థి దిజులా విజేసూర్య చెప్పారు. సిడ్నీ, మెల్బోర్న్ ల్లో భారత విద్యార్థులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో తాము భయపడుతూనే ఉన్నామని అతను చెప్పాడు. తాము ఇంటి నుంచి కదలడం లేదని, యుఎన్ఐకి వెళ్లి ఇంటికి వచ్చి తలుపులు బిగించుకుని కూర్చుంటున్నామని అతను చెప్పాడు. ఈ సంఘటన తనకు ఆశ్చర్యం కలిగించిందని కాన్ బెర్రా ఇండియా ఆస్ట్రేలియా అసోసియేషన్ అధ్యక్షురాలు మధు కాలియా అన్నారు.