చార్మినార్ సాక్షి ప్రేమోన్మాది ఘాతుకం
ఆమె రెండు కాళ్లు విరిగిపోయాయని, కుడి చెయ్యి, ఎడమ కన్ను పైభాగంలో తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. శరీరంలో అంతర్గతంగా గాయాలయ్యాయని తెలిపారు. తీవ్ర రక్తస్రావంకావడం వల్ల తొలుత రక్తం ఎక్కించి, శస్త్రచికిత్స చేస్తున్నట్లు ఉస్మానియా వర్గాలు తెలిపాయి. విరిగిన కాళ్లు, చేతులకు కట్లు కట్టారు. శరీరంలో ఇంకా ఎక్కడెక్కడ గాయాలయ్యాయనే విషయాన్ని గుర్తించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాధితురాలి కుటుంబ సభ్యులు మాత్రం రాత్రివరకు ఆసుపత్రికి రాకపోవడం గమనార్హం. సమీర ఏం చదువుతోంది? అర్షాద్ ఏం చేస్తున్నాడు? సమీరను తోసేశాక అతను ఎక్కడికి తప్పించుకుపోయాడు? అతను ఇంతటి కిరాతకానికి ఎందుకు ఒడిగట్టాడు? మొదలైన విషయాలు తెలియాల్సి ఉంది.
బాధితురాలు సమీర ఉస్మానియా ఆసుపత్రిలో విలేఖరులతో మాట్లాడారు. "సరదాగా గడుపుదామని చెప్పిన అర్షాద్ చార్మినార్ పైకి తీసుకెళ్లాడు. పైనుంచి తోసేశాడు. అతను తలాబ్ కట్టకు చెందినవాడే" అని చెప్పింది. ఆ తర్వాత అపస్మారక స్థితికి చేరుకుంది. వైద్యులు ఆమెకు కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు.