కెసీఅర్ ఫ్యామిలీ పోవాల్సిందే
హైదరాబాద్: టీఅర్ ఎస్ లో అసమ్మతి చిచ్చు చల్లారే అవకాశం కన్పించడం లేదు. అధ్యక్ష పదవి నుంచి కె. చంద్రశేఖర్రావు వైదొలగాల్సిందేనని టీఆర్ఎస్ అసమ్మతి నేతలు పట్టుబడుతున్నారు. ఆయన కుటుంబం పార్టీ నుంచి వైదొలగాలనే డిమాండ్ను కొనసాగిస్తున్నారు. ఈ మేరకు పార్టీ అసమ్మతి నేతలు శనివారం మరోసారి రహస్య భేటీ జరిపారు.
ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు డాక్టర్ ఎ.చంద్రశేఖర్, డాక్టర్ జి.విజయరామారావు, పార్టీ ప్రధానకార్యదర్శి, మాజీ ఎంపీ డి.రవీంద్రనాయక్, మరో ప్రధానకార్యదర్శి కె.కె.మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షురాలు రెడ్డి ఉమాదేవి, పార్టీ మహబూబ్నగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు యెన్నం శ్రీనివాస్రెడ్డి, నల్గొండ జిల్లా శాఖ అధ్యక్షుడు సోమిరెడ్డి, పార్టీ యువజన విభాగం మాజీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సుహాసినిరెడ్డి సహా 20 మంది ముఖ్యులు పాల్గొన్నారు. తొలుత వీరు రాజ్భవన్ రోడ్డులోని ఒక ఇంట్లో సమావేశమయ్యారు.
విషయం బయటికి పొక్కటంతో విద్యానగర్లోని మరొక ఇంట్లోకి మకాం మార్చి సమాలోచనలు కొనసాగించారు. 'పార్టీ రాష్ట్ర కమిటీని సమావేశపరిస్తే ఎలా వ్యవహరించాలి? ఒకవేళ కేసీఆర్ రాష్ట్ర కమిటీని రద్దు చేస్తే ఎటువంటి చర్యలకు పూనుకోవాలి?' అనే అంశాలపై వీరి మధ్య చర్చలు జరిగాయి. 2001 నుంచి ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్లను సమీకరించాలని నిర్ణయించారు.
తొలుత కొడుకు, కూతురు అమెరికాలో ఉన్నారని, ఇక్కడ తాను, తన భార్య తప్ప ఎవరూలేరని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కుటుంబ సభ్యులతోనే పార్టీని నడిపిస్తుండటంపై సమావేశంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కేసీఆర్ తప్పిదాల వల్లనే ముఖ్యమంత్రి వైఎస్ అంత ధైర్యంగా తెలంగాణ అంశంపై మాట్లాడగలిగారని అసమ్మతి నేతలు ఏకాభిప్రాయం వెలిబుచ్చారు












Click it and Unblock the Notifications