స్పీకర్ పై చంద్రబాబు గరం
కాంగ్రెసు ప్రభుత్వం నియంతలా ప్రవర్తిసోందని, ఎమర్జెన్సీని తలపిస్తోందని చంద్రబాబు విమర్శించారు. తమపై సభ వెలుపల, బయటా అణచివేత చర్యలకు దిగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆయన అన్నారు. తమను రెచ్చగొట్టే ధోరణిలో ప్రభుత్వమే వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. సీనియర్ మంత్రి రోశయ్య మాట్లాడిన తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రెఫరెండమంటూ తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, తాను మామూలుగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రెచ్చగొట్టేలా వ్యవహరించారని, తాను రెఫరెండానికి సిద్ధపడినా ముఖ్యమంత్రి వెనక్కి వెళ్లారని ఆయన అన్నారు. రాష్ట్రమంతా రెఫరెండం పెడితే తాను సిద్ధంగానే ఉన్నానని ఆయన అన్నారు. బాబ్లీ ప్రాజెక్టు ప్రయోజనాలను కాపాడలేకపోయిన ప్రభుత్వం చర్చకు కూడా అనుమతించడం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ధోరణిని తాము ఎదుర్కుంటామని ఆయన చెప్పారు.