కాంగ్రెస్, టిడిపి పోటీ ధర్నాలు
హైదరాబాద్: శాసనసభ ప్రవేశ ద్వారం వద్ద తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల శాసనసభ్యులు పోటాపోటీ ధర్నాలు నిర్వహించాయి. సభలో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తీరును నిరసిస్తూ తెలుగుదేశం సభ్యులు శాసనసభ ప్రవేశద్వార వద్ద ధర్నాకు దిగారు. సభా సమయాన్ని తెలుగుదేశం సభ్యులు వృధా చేస్తున్నారని నిరసిస్తూ కాంగ్రెసు సభ్యులు ధర్నాకు దిగారు. తెలుగుదేశం సభ్యులు కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెసు పార్టీ తెలుగుదేశం తీరుపై విమర్శలు చేశారు.
శాసనసభ్యుడు గాలి ముద్దు కృష్ణమ నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మంత్రి రోశయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ సభ్యులు బుధవారం సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. దాంతో సభను స్పీకర్ అర్థాంతరంగా రేపటికి వాయిదా వేశారు. దీంతో స్పీకర్ చర్యను నిరసిస్తూ తెలుగుదేశం సభ్యులు ధర్నాకు దిగారు. కాంగ్రెసు ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ సభ్యులు విమర్శించారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా తెలుగుదేశం పార్టీ సభా సమయాన్ని వృధా చేస్తోందని కాంగ్రెసు సభ్యులు విమర్సలు చేశారు.