తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు కమిటీ?
ఆదివారంనాడు ఢిల్లీకి వచ్చిన తెలంగాణ మంత్రులు కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. తగిన ప్రకటన వస్తుందని ప్రణబ్ హామీ ఇచ్చినట్లు వారు ఆదివారంనాడే చెప్పారు. కాగా, తాము ప్రణబ్ హామీతో సంతృప్తి చెంది రాజీనామాలు ఉపసంహరించుకుంటున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు రాజీనామాలను ఉపసంహరించుకోబోమని వారు సోమవారం స్పష్టం చేశారు. వారు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో కూడా సమావేశమయ్యారు. తమ మనోభావాలను అధిష్టానానికి విన్నవించేందుకు సహకరించాలని, తమకు నేతృత్వం వహించాలని వారు జైపాల్ రెడ్డిని కోరారు. అందుకు జైపాల్ రెడ్డి అంగీకరించినట్లు వారు తెలిపారు.
కాగా, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు తన నివాసంలో రాష్ట్ర మంత్రులకు సోమవారం మధ్యాహ్నం విందు ఇచ్చారు. ఈ విందుకు రాష్ట్ర తెలంగాణ మంత్రులతో పాటు కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి కూడా హాజరయ్యారు. మరోవైపు జై ఆంధ్ర ఉద్యమ నాయకుడు వసంత నాగేశ్వర రావు కూడా ఈ విందుకు రావడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తున్న కోస్తాంధ్రలోని అమలాపురం కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ కూడా ఈ విందుకు హాజరయ్యారు. కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ రాష్ట్ర విభజన జరగాలా, వద్దా అనే విషయంపై కాకుండా రాష్ట్ర విభజనకు తీసుకోవాల్సిన చర్యలను చేపడుతుందని అంటున్నారు.