ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్..
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం సర్కిల్లో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) భారీ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం రాజకీయ, సినీ వర్గాల్లో విశేష చర్చనీయాంశంగా మారింది. మైత్రీవనం పరిసరాలు ఎన్టీఆర్ అభిమానులతో కళకళలాడగా, భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్..
ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజహరుద్దీన్, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అలాగే నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి రామకృష్ణ, మోహనకృష్ణతో పాటు సినీనటుడు మంచు మనోజ్, దర్శకుడు బోయపాటి శ్రీను హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం సందర్భంగా మైత్రీవనం సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి అభిమానులకు హామీ ఇచ్చారు. ఇప్పుడు అదే మాటను నిలబెట్టుకుంటూ ఎన్టీఆర్ జయంతి రోజునే విగ్రహాన్ని ఆవిష్కరించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎన్టీఆర్ లేకుంటే నాయకులు అయ్యారా..?
విగ్రహావిష్కరణ అనంతరం నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని రేకెత్తించాయి. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్)కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ నీడన ఎదిగిన వారు ఈరోజు ఆయన్నే తక్కువ చేసి మాట్లాడటం సమంజసం కాదని.. ఆయన లేకపోతే నాయకులయ్యారా?" అంటూ రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణలో ఎదిగిన అనేక మంది నాయకులకు రాజకీయ అవకాశాలు కల్పించింది ఎన్టీఆర్ అని గుర్తుచేశారు.
కాగా తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, మాధవరెడ్డి, జానారెడ్డి, దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరి, మోత్కుపల్లి నర్సింహులు వంటి నాయకులతో పాటు కేసీఆర్కు కూడా ఎన్టీఆర్ రాజకీయ అవకాశాలు కల్పించారని రేవంత్ పేర్కొన్నారు. ఈ చరిత్రను ఎవరూ మరచిపోవద్దని అన్నారు. అలానే తన ప్రసంగంలో రేవంత్ రెడ్డి దేశ చరిత్రలో ముగ్గురు మహానేతలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేడ్కర్, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, మాజీ సీఎం ఎన్.టి. రామారావులను జాతిరత్నాలుగా అభివర్ణించారు.
అంబేడ్కర్ మహిళలకు ఓటుహక్కు కల్పించి సమానత్వానికి పునాది వేశారని, ఇందిరాగాంధీ భారత్ను ప్రపంచంలో గౌరవనీయ స్థాయికి తీసుకెళ్లారని, ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారని రేవంత్ కొనియాడారు. పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను సీఎం గుర్తుచేశారు. రెండు రూపాయల కిలో బియ్యం పథకం, పటేల్-పట్వారీ వ్యవస్థ రద్దు, మహిళలకు ఆస్తి హక్కులు వంటి సంచలన నిర్ణయాలు ఆయన తీసుకున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు విముక్తి కల్పించిన మహానేత ఎన్టీఆర్ అని అభివర్ణించారు. తెలుగు ప్రజల్లో ఆత్మగౌరవాన్ని నింపిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు.
LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participates in the Unveiling of the Statue of Sri N.T. Rama Rao at Maitri Vanam Junction, Hyderabad https://t.co/lJMfEGx5Gg
— Telangana CMO (@TelanganaCMO) May 28, 2026
కాంగ్రెస్ సీఎం.. ఎన్టీఆర్ విగ్రహం?
కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్గా ఉండి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎందుకు ఆవిష్కరిస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారని రేవంత్ అన్నారు. అయితే కుల, మత, ప్రాంత, రాజకీయ భేదాలకు అతీతంగా దేశం గర్వించదగిన నాయకుడు ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం తన జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకమని చెప్పారు. విగ్రహావిష్కరణ సందర్భంగా మైత్రీవనం ప్రాంతమంతా పసుపు జెండాలు, ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో కళకళలాడింది. అభిమానులు "జై ఎన్టీఆర్" నినాదాలతో సందడి చేశారు. ఎన్టీఆర్ సినిమాల పాటలు, డైలాగులతో ప్రాంతం మార్మోగింది.












Click it and Unblock the Notifications